‘శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలి’

7 Dec, 2019 14:06 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: హాజీపూర్‌ వరస హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలని హాజీపూర్‌ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. వారంతా ‘శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలి’ అనే నినాదాలు చేస్తూ.. హాజీపూర్‌లో నిరసన చేపట్టారు. షాద్‌నగర్‌లో ‘దిశ’పై అత్యాచారం, హత్య చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు.. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు.

నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్‌ విద్యార్థులను దారుణంగా అత్యాచారం, హత్య చేసిన చేసిన విషయం తెలిసిందే. షాద్‌నగర్ ఘటన జరిగిన తొమ్మిది రోజుల్లోనే నిందితులను ఎన్‌కౌంటర్‌లో మట్టు బెట్టిన ప్రభుత్వం.. హాజీపూర్‌ ఘటనను ఎందుకు సీరియస్‌గా తీసుకోవడంలేదని ప్రశ్నించారు. దీంతో పాటు బొమ్మల రామారం పోలీసులను కలిసి శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలని కోరారు. ఈ నిరసనలో గ్రామస్తులు, బాధత కుటుంబ సభ్యులు, హాజీపూర్‌ గ్రామ సర్పంచ్ తిరుమల కవిత వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.

సాక్షి, కొమురంభీం ఆసిఫాబాద్: చెంచు మహిళ టేకు లక్ష్మిని అత్యాచారం, హత్య చేసిన నిందితులను కూడా ఎకౌంటర్ చెయ్యాలని ఆదివాసీ, దళిత, మైనారిటీ, విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేశాయి. దీంతోపాటు జైనూర్‌, లింగాపూర్‌, సిర్పూర్‌​ యూ ప్రాంతాల్లో సంపూర్ణ బంద్‌ను చేపట్టారు. టేకు లక్ష్మిబాయిని అత్యాచారం చేసిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని జైనూర్‌లో రాస్తారోకో చేశారు. అన్ని సంఘాల నాయకులు ర్యాలీ చేస్తూ.. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జైనూర్‌లోని మార్కెట్‌లో కూడా బంద్‌ను నిర్వహించారు.

మరిన్ని వార్తలు