అట్టడుగు నుంచి  అభివృద్ధి వైపు.. హన్మంత్‌సింధే

3 Dec, 2018 13:17 IST|Sakshi

నాలుగేళ్లలో రూ.1,560 కోట్ల నిధులతో పనులు

జుక్కల్‌లో విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట  

కర్ణాటక, మహరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న జుక్కల్‌ త్రిభాషా పద్ధతులకు నిలయంగా మారింది. సమైఖ్యపాలనలో వెనుకబడి ప్రాంతంగా పేరొందిన జుక్కల్‌ ఎస్సీ రిజర్వ్‌ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కంచుకోటగా నిలిచిన జుక్కల్‌ నియోజకవర్గం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ కారు జోరందుకుంది.

గతంలో వెనుకబడిన ప్రాంతమిది..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న జుక్కల్‌ నియోజకవర్గం 1978లో ఎస్సీలకు రిజర్వ్‌ అయింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి ఇక్కడి నుంచి ఏపీ అసెంబ్లీకి ఎన్నికైనా అభివృద్ధిని విస్మరించారు. రోడ్లు, రవాణా సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో విద్య, వైద్య సదుపాయాలు అందని ద్రాక్షగా మారాయి. సాగునీటి సదుపాయం లేక వ్యవసాయం దెబ్బతింది. అంతరాష్ట్ర లెండి ప్రాజెక్టుకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో పనులు అర్థంతరంగా నిలిచాయి. 

స్వరాష్ట్రంలో అభివృద్ధి బాట

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత 2014లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా హన్మంత్‌సింధే విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సీఎం కావడం టీఆర్‌ఎస్‌ నుంచి హన్మంత్‌సింధే ఎమ్మెల్యే కావడంతో జుక్కల్‌ నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. నిరక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్న జుక్కల్‌ నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లు, రవాణా మార్గాలు మెరుగయ్యాయి. నాలుగు నెలల కాలంలో రూ.1,560 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.

నియోజకవర్గంలో అభివృద్ధి ఇది..

  • పిట్లం, బిచ్కుద, పెద్దకొడప్‌గల్‌ మండలాల్లోని 50గ్రామాలు, నిజాంసాగర్‌ మండలంలోని నాన్‌కమాండ్‌ ఏరియా ప్రాంత ప్రజల చిరకాల కోరికైన నాగమడుగు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.476.25 కోట్లు మంజూరు చేసింది. 
  • డబుల్‌ లైన్‌ రోడ్లు లేని జుక్కల్‌ నియోజకవర్గంలో 14రోడ్లను 165కి.మీ మేర సుందరీకరణకు రూ. 212.08 కోట్లు కేటాయించింది.
  • అలాగే ఆయా మండలాల్లో నూతనంగా 6 వంతెనలకు రూ.52కోట్లు 
  • మిషన్‌ కాకతీయ పథకం కింద 264 చెరువుల పునరుద్ధరణ కోసం రూ.85కోట్లు 
  •  వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు గోదాములు 23,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి రూ.14.50కోట్లు 
  • జుక్కల్, బిచ్కుంద మండల కేంద్రాల్లో 30 పడకల ఆస్పత్రుల గదుల నిర్మాణానికి రూ.10కోట్లు
  • పంచాయతీరాజ్‌ బీటీ రోడ్లు 32 గ్రామాలకు 45కి.మీ రూ.52కోట్లు
  • మిషన్‌ భగీరథ  పథకానికి రూ.300 కోట్లు మంజూరు 
  • జుక్కల్‌ జూనియర్‌ కళాశాలకు రూ.2.25 కోట్లు 
  • బిచ్కుంద జూనియర్‌ కళాశాలకు రూ.1.50 కోట్లు 
  • రెసిడెన్షియల్, కళాశాలలు,  పాఠశాల అదనపు గదులకు రూ.25 కోట్లు 
  • రూ. 45 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం 
  • రూ. 40 కోట్లతో కమ్యూనిటీ భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం 
  •  పెద్దకొడప్‌గల్‌లో మండల కేంద్రంగా ఏర్పాటు 
  • కొత్తగా  66 గ్రామ పంచాయతీలు ఏర్పాటు 

చేపట్టాల్సిన పనులు

నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను పర్యాట కేంద్రంగా తీర్చిదిద్దడం, నిజాంసాగర్‌ మండల కేంద్రంలో జూనియర్‌ కళాశాల, పిట్లం మండల కేంద్రంలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల, పక్కగృహాలు లేనికి వారికి సొంతిళ్ల నిర్మాణం, కౌలాస్‌ కాలువల ఆధునికీకరణ, ఇండస్ట్రియల్స్‌ ఏర్పాటు చేయాల్సిన ఉంది. 

సెగ్మెంట్‌ గ్రాఫ్‌ 

మండలం ఓటర్లు పురుషులు  స్త్రీలు     ఇతరులు
మద్నూర్‌  40,254  20,251    19,999    04 
జుక్కల్‌  31,797   16,117   15,680    00 
బిచ్కుంద    35,508 17,527   17,977  04 
పెద్దకొడప్‌గల్‌  13,638    6,833  6,804    01 
పిట్లం   30,370   14,842   15,524   04
నిజాంసాగర్‌   25,309   11,884  13,424  01

ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి 

ఇంజినీరింగ్‌ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి తనను జుక్కల్‌ నియోజవర్గ ప్రజలు ఆదరిస్తున్నారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయా.2009 ఎన్నికల్లో గెలిచినా కాంగ్రెస్‌ ప్రభుత్వ  కారణంగా అనుకున్నతంత అభివృద్ధి జరగలేదు.  రాష్ట్ర సాధన కోసం 2014 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాను. స్వరాష్ట్రంలో జుక్కల్‌ అభివృద్ధికి సీఎం నిధులు కేటాయించడంతో పురోగతి సాధించాం. ఇప్పటివరకు చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుంది.
– హన్మంత్‌సింధే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే  

మరిన్ని వార్తలు