బియ్యం చౌక దందా కేక

28 Nov, 2015 01:47 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతకు సీమ అక్రమ రేషన్ బియ్యం దందాకు అడ్డాగా మారింది. స్టాక్ మార్కెట్ తరహాలో సిద్దిపేట, మెదక్, పటాన్‌చెరు కేంద్రాలుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. రోజుకు కనీసం రూ.30 లక్షల విలువైన రేషన్ బియ్యం దారి మళ్లుతున్నట్టు అంచనా! జిల్లాలో పేరున్న కొందరు డీలర్ల కనుసన్నల్లో వ్యాపారం నడుస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లా అంతటా పలుచోట్ల బియ్యం నిల్వలను ఉంచి వాటిని రాత్రికి రాత్రే లారీల్లో తరలిస్తున్నారు. అయినా అటు పౌరసరఫరాల అధికారులు, ఇటు విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.

 ఎక్కడికక్కడ నిల్వ కేంద్రాలు
 జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, పే దల బియ్యాన్ని అక్రమార్కులు బొక్కేయడం కొత్తేమీ కాదు. అయితే, ఇటీవల ఈ దందా వే ళ్లూనుకుంది. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, సం గారెడ్డి, జోగిపేట, పటాన్‌చెరు నియోజకవర్గాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని పఠాన్‌చెరు లో నిల్వ చేస్తున్నట్టు సమాచారం. మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల బియ్యాన్ని జహీరాబాద్‌లో ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ గతంలో మూతపడిన ఓ రైస్‌మిల్లును అడ్డాగా చేసుకొన్నారు. రేషన్ షాపుల్లో బియ్యాన్ని టా టా ఏస్ వాహనాల్లో ఆయా పట్టణాల్లోని నిల్వ కేంద్రాలకు తరలిస్తారు. మళ్లీ అవే వాహనాల్లో రాత్రి వేళ లారీల్లోకి లోడ్ చేస్తారు. ఈ సరుకును హైదరాబాద్, నిజామాబాద్, మహారాష్ట్రలోని పలు పారాబాయిల్డ్ మిల్లులకు తరలిస్తారు.

 స్టాక్‌మార్కెట్ల తరహాలో...
 ఈ వ్యాపారంలో రోజుకు రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. డీలర్ల నుంచి వ్యాపారులు రూ.10 కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని రూ.18 చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నారు. సరుకును రెండుమూడ్రోజుల్లో లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ లో 204 క్వింటాళ్ల బియ్యం తరలింపు లెక్క వే సుకున్నా మొత్తం రోజువారీ వ్యాపారం రూ.30 లక్షల వరకు జరుగుతోందని అంచనా. అయితే, ఈ రేటు కూడా నిలకడగా ఉండదు. కొన్ని రో జులుగా టాస్క్‌ఫోర్స్ దాడులు ఎక్కువైన నేపథ్యంలో వ్యాపారులు బియ్యం కొనలేమని చెప్పి డీలర్లకు కిలోకు రూ.8-7కు తగ్గించినట్టు తెలుస్తోంది. ఇలా స్టాక్ మార్కెట్ల తరహాలో రోజుకో రేటుతో వ్యాపారం జరుగుతున్నా అధికారులకు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడూ పోలీ సులు అక్రమ రేషన్ బియ్యమంటూ ఒకటి, రెం డు ఆటోలను పట్టుకుని వదిలేస్తున్నారు. దీంతో వ్యాపారం షరా మామూలేగా మారింది.
 

మరిన్ని వార్తలు