కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పీ నింపుతాం

10 Jul, 2017 08:00 IST|Sakshi
కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పీ నింపుతాం

వచ్చే ఏడాది నుంచే డీ–53 కింద రెండు పంటలకు నీరందిస్తాం
► కాళేశ్వరంతో మిడ్‌మానేరుకు లింక్‌.. కింది ప్రాంతాలకు నీళ్లు
► పోచంపాడు నీళ్లు సమృద్ధిగా వాడుకునేలా ప్రణాళికలు
► రూ. వెయ్యి కోట్ల మంజూరు.. టెండర్లు పూర్తి
► రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు


సాక్షి, జగిత్యాల: ‘ఇకపై నారుమళ్లు పోసుకుని.. కాల్వ నీళ్ల కోసం ఎదురుచూసే పరిస్థితులుండవు.. వచ్చే ఏడాది నుంచి జూన్‌లోనే నాట్లు వేసుకునేలా ఎస్సారెస్పీ ద్వారా సాగునీరందిస్తాం.. డీ–53 కింద రెండు పంటలకు సాగునీరందించి తీరుతాం.’అని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రైతులకు అభయమిచ్చారు. గతంలో పోచంపాడు నిండి పొంగితేనే వరదకాల్వ గేట్లు లేపి లోయర్‌ మానేరు డ్యామ్‌కు నీళ్లు పంపేవాళ్లమని, ఇకపై వరదకాల్వనే రిజర్వాయర్‌గా మార్చి కాళే శ్వరం నీళ్లను వరదకాల్వ ద్వారా పోచంపాడును నింపేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతు న్నా యని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. పనుల టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిందని వివరించారు.

జగిత్యాల జిల్లా బీర్‌పూర్, ధర్మపురి మండలాల్లో 14 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేలా రూ.60 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌లతో కలసి మంత్రి హరీశ్‌ ప్రారంభించారు. అనంతరం ధర్మపురిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాళేశ్వరం పూర్తయితే గోదావరిలో వరద రాకపోయినా.. పోచంపాడులో నీళ్లులేక పోయినా కాలమైనా.. కాకపోయినా.. బాధ పడా ల్సిన అవసరం లేదన్నారు.  ఎస్సారెస్పీ నీళ్లన్నీ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలకు వాడుకునే వీలుంటుందన్నారు.

‘వాస్తవానికి ఎస్సారెస్పీ స్టేజ్‌–1 కింద 9.60 లక్షల ఎకరాలకు పారాలి.  సీఎం కేసీఆర్‌ ప్రతి ఎకరాకు నీరందించేలా.. రూ.650 కోట్లతో ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలు.. డిస్ట్రిబ్యూటరీ కాల్వల మరమ్మతు కార్యక్రమం చేపట్టారు. రెండేళ్ల కాలంలో కాల్వ మరమ్మతు, ఆధునీకరణ కోసం రూ.186 కోట్లు ఖర్చు చేశాం’ అని హరీశ్‌ చెప్పారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ రెండేళ్లలో రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు.  రాష్ట్రంలో రూ.30 వేల కోట్లతో ఇంటింటికీ నీళ్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేత కేసీఆర్‌ అని కొనియాడారు.

కవిత మాట్లాడుతూ ఎన్నికల ముం దు జగిత్యాల జిల్లా ఏర్పాటు, రోళ్లవాగు ఆధునీ కరణ, బోర్నపల్లి బ్రిడ్జి నిర్మాణాలకు హామీలిచ్చా మని, వాటిని అమలు చేసి నిరూపించుకున్నా మన్నారు. 60 ఏళ్లలో 296 సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ద్వారా 1.30 లక్షల మంది విద్యార్థులు విద్య పొం దగా.. మూడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో 496 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో 1.40 లక్షల మంది విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారని చెప్పా రు. సభలో ప్రభుత్వ చీఫ్‌ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెసోళ్లు నకిలీ లీడర్లు..
మంత్రి హరీశ్‌రావు.. కాంగ్రెస్‌ నాయకులను నకిలీ లీడర్లుగా అభివర్ణించారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులు ఏర్పాటుచేయాలని పూనుకుంటే.. కాంగ్రెస్‌ నాయకులు చనిపోయిన వారి పేరిట కోర్టులో కేసులువేసి వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిలోగా ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌.. కోటి ఎకరాలకు సాగునీరందించే కృతనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులు, కాల్వల ఆధునీకరణ పను లను అధికారులు టాప్‌ ప్రయారిటీగా తీసుకోవాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఇరి గేషన్‌.. రెవెన్యూ అధికారులను రాయపట్నం వద్ద నిర్వహించిన సమీక్షలో హెచ్చరించారు.

సెల్ఫీలొద్దు.. విధులపై ధ్యాస పెట్టండి..!
‘మీకు చెప్పిందేమిటీ..? మీరు చేస్తుందే మిటీ..? వెళ్లి పని చేయమంటే సెల్ఫీలు దిగి.. అవే ఫొటోలు మళ్లీ నాకే పంపుతారా..? సెల్ఫీలపై ఉన్న ధ్యాస విధులపై లేదా..? తీరు మార్చుకోండి.’అంటూ మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్‌ అధికారులపై మండిపడ్డారు. ఎస్సారెస్పీ ప్రధాన... డిస్ట్రిబ్యూటరీ కాల్వల స్థితిగతులు తెలుసుకుని నివేదిక ఇవ్వాల్సిన ఉద్యోగులు.. ఆ కాల్వలపై సెల్ఫీలు దిగి వాటిని ఇరిగేషన్‌ గ్రూపులో పెట్టడంతో ఆగ్రహించిన హరీశ్‌రావు.. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌ను పిలిచి ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు