‘టెక్నాలజీ మోజులో వేద ధర్మాన్ని మర్చిపోవద్దు: హరీశ్‌రావు

17 Oct, 2019 14:10 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట : వేద ధర్మాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.  గురువారం తెలంగాణ వేద విద్వన్‌ మహాసభల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్ధిపేటలో తెలంగాణ వేద విద్వన్‌ మహాసభలు జరిపేందుకు అవకాశం ఇవ్వడం తమ అదృష్టమని అన్నారు. సిద్ధిపేట నాలుగు రోజుల పాటు వేదఘోషతో సుభిక్షమవుతుందనన్నారు. వేద పరిరక్షణకు.. ఈ ట్రస్ట్‌ చేస్తున్న కృషి అభినందనీయమని, ధార్మిక, ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.  వేదం అభ్యసించిన విద్యార్థులకు ఇక్కడ పరీక్షలు నిర్వహించి పట్టాలు ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి ప్రశంసించారు.

నేటి తరం కూడా వేద పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ మోజులో పడి వేద ధర్మాన్ని మరువవద్దని సూచించారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా గొప్ప భక్తుడని, ధార్మిక సేవా తత్పురుడని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే ఉద్ధేశంతోనే సీఎం ఆయుత చండీయాగం నిర్వహించారని తెలిపారు. కేసీఆర్‌ రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరించడంతోపాటు..  ఆలయాల్లోని ఆర్చకులకు ప్రభుత్వ నిధి ద్వారా వేతనాలు ఇస్తున్నారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచీన దేవాలయాల అర్చకులకు ధూప దీప నైవేద్యం పథకం కింద వేతనాలు అందిస్తున్నామని హరీశ్‌రావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు