75 శాతం కందులను కేంద్రం కొనాలి: హరీశ్‌

28 Aug, 2018 03:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంది, పప్పుదినుసుల ఉత్పత్తిలో 75 శాతం మేర కొనుగోలు చేయాలని మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం 60 రోజులుగా ఉన్న సేకరణ దినాలను 150 రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఉత్పత్తిలో 25 శాతమే కేంద్రం కొనుగోలు చేయడం, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం వల్ల అప్పులే మిగులుతున్నాయని పేర్కొన్నారు.

గతేడాది కేంద్రం 75,300 క్వింటాల్‌ కందులు మాత్రమే కొనుగోలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 1.84 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఇందులో ఇప్పటికీ కేవలం 12 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే విక్రయించగా క్వింటాల్‌కు రూ.3,500 ధర మాత్రమే వచ్చినట్లు పేర్కొన్నారు. మయన్మార్‌ తక్కువ ధరకే పప్పును ఎగుమతి చేస్తోందని, ఇది ధరలపై ప్రభావం చూపుతోందన్నారు. ఎగుమతి, దిగుమతి విధానాలపై దృష్టి సారించి మార్పులు చేయాలని, తద్వారా స్థానిక రైతులకు మేలు చేసినట్లవుతుందని వివరించారు.  

>
మరిన్ని వార్తలు