విలువలు, విజ్ఞాన పరిరక్షణ బాధ్యత అందరిదీ: హరీశ్‌

14 Oct, 2019 03:36 IST|Sakshi

ఖైరతాబాద్‌: భారతీయ విలువలు, విజ్ఞానం కనుమరుగు కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో జేకేఆర్‌ ఆస్ట్రో రీసెర్చ్‌ ఫౌండేషన్‌ 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటుచేసిన జాతీయ జ్యోతిష్య సదస్సును మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జ్యోతిష్యాన్ని తాను నమ్ముతానని, భూత, భవిష్యత్తులన్నింటినీ ఆ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. నమ్మకం, విశ్వాసమే సమాజాన్ని నడిపిస్తాయని, ప్రభుత్వాలు చేయలేని ఏ పనైనా జ్యోతిష్యులు చేయగలరన్నారు. దీనిపై పరిశోధనలు జరగడం, వర్సిటీల ఏర్పాటు వంటివి శుభసూచకమన్నారు.

జేకేఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌వీఆర్‌ఏ రాజా మాట్లాడుతూ నేడు వ్యాపారాత్మకమవుతున్న జ్యోతిష్య శాస్త్రాన్ని అత్యుతన్నత ప్రమాణాలతో, ధార్మిక చింతనతో ముందుకు తీసుకువెళ్లేలా తమ సంస్థ కృషిచేస్తోందన్నారు. ఇందుకు ఉచితంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అందిస్తామని తెలిపారు. సాయంత్రం వర్సిటీ (ఫ్లోరిడా–యూఎస్‌ఏ) 11వ స్నాతకోత్సవం సందర్భంగా పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో యోగ సంస్కృ తం వర్సిటీ చాన్స్‌లర్‌ బీవీకే శాస్త్రి, కిమ్స్‌ ఆస్పత్రి సీఎండీ భాస్కరరావు హాజరయ్యారు. జ్యోతిష్యం లో కృషిచేస్తున్న ఆకెళ్ల కృష్ణమూర్తి, సాగి కమలాకర శర్మ, కశ్యప్రభాకర్‌ తదితరులను సన్మానించారు.

మరిన్ని వార్తలు