కేంద్రం తీరుతో రాష్ట్రాలకు నష్టం 

6 Nov, 2019 03:29 IST|Sakshi

ఐజీఎస్టీ పంపకాలు రాష్ట్రాల రెవెన్యూపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానంలో భాగంగా ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన నిధులను ఇవ్వడంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుతో రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధుల్ని పంపిణీ చేయడంలో రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తిరోగమన ప్రభావాన్ని చూపుతున్నాయని విమర్శించారు. 2017–18 వరకు ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.2,812 కోట్లను వెంటనే ఇప్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. ‘2017–18 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,76,688 కోట్లు ఐజీఎస్టీ కింద కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాలి. అందులో రూ.67,988 కోట్లకు సంబంధిం చిన అంశాలను పరిష్కరించి అన్ని రాష్ట్రాలకు పంపకాలు చేశారు. ఈ పంపకాల కింద తెలంగాణకు రూ.1,652 కోట్లు (2.437%) కేటాయించారు.

ఈ మొత్తం రాష్ట్రానికి వచ్చింది. ఐజీఎస్టీ పంపకాల విషయంలో కేంద్రం అనుసరి స్తున్న ఫార్ములా రాజ్యాంగ విరుద్ధమని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తేల్చింది. ఈ మేరకు తమ ఆమోదం కోసం జీఎస్టీ కౌన్సిల్‌ పంపిన ప్రతిపాదనను కాగ్‌ ఒప్పుకోలేదు. కాగ్‌ లెక్క ప్రకారం ఐజీఎస్టీ కింద వసూలయ్యే మొత్తం పన్నులో రాష్ట్రాలకు 50% పంపిణీ చేయాలి కనుక గతంలో పరిష్కరించిన రూ.67,988 కోట్లు కాకుండా 88,344 కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అడ్‌హాక్‌ సెటిల్‌మెంట్‌ కింద ఈ మొత్తంలో 4.03% చొప్పు న రూ. 3,560 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది.

14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం 50% రాష్ట్రాలకు పంపి ణీ చేయగా మిగిలిన మొత్తంలో కూడా 58:42% చొప్పున రాష్ట్రాలకు ఇవ్వాలి. ఈ లెక్కన వచ్చే రూ.904 కోట్లతో కలి పి తెలంగాణకు రూ.4,464 కోట్లు రావాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు వచ్చింది రూ. 1,652 కోట్లే. కేంద్రం తీరుతో మాతో పాటు చాలా రాష్ట్రాలు నష్టపోయాయి. రెండేళ్లుగా తెలంగాణకు జీఎస్టీ పరిహారం ఇవ్వడం లేదు. ఐజీఎస్టీ కింద మాకు రావాల్సిన మొత్తాన్ని త్వరలో ఇప్పించేలా చర్యలు తీసుకోండి’ అని లేఖలో కోరారు.   

మరిన్ని వార్తలు