నూతన లక్ష్యాలను పెట్టుకోండి: హరీశ్‌రావు

1 Jan, 2020 02:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విద్యార్థులు, యువత కొత్త సంవత్సరంలో నూతన లక్ష్యాలను పెట్టుకోవాలని, ఆ లక్ష్యాలను అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కష్టపడి పనిచేయాలని మంత్రి టి.హరీశ్‌రావు ఆకాంక్షించారు. నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆయన రాష్ట్ర ప్రజలకు మంగళవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అందరికీ మంచి జరగాలి: వినోద్‌కుమార్‌
నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ ఓ ప్రకటనలో ఆకాంక్షించారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు: ఉత్తమ్‌
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలు శాంతితో జీవించాలని, అన్ని విధాలా వారికి మంచి జరగాలని ఓ ప్రకటనలో ఆయ న ఆకాంక్షించారు. గతేడాది కొన్ని దుర్ఘటనలు జరిగినా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. 
 

సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు భాగం కావాలి: లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్‌ అభిలషించారు. భారత్‌ను శక్తిమంతమైన దేశంగా రూపొందించడంలో ప్రజలంతా కృషి చేయాలని, అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన కోరారు.  

‘ఉల్లాసంగా జరుపుకోండి’
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది వేడుకలను ప్రమాద రహితంగా జరుపుకోవాలని, పౌరుల భద్రతకై ఉద్దేశించిన ట్రాఫిక్‌ తదితర నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. పోలీసులకు సహకరించి ఈ వేడుకలను ఉల్లాసంగా జరుపుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

>
మరిన్ని వార్తలు