సాక్షి, సిద్ధిపేట : పట్టణ అభివృద్ధిలో రాజస్థాన్ వాసుల సహకారం, ఎన్నికల్లో వారి అభిమానం మరువలేనిదని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం సిద్ధిపేట రాజస్థాన్ మార్వాడి సమాజ్ వారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా జరిగిన ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజస్థాన్ అక్కా చెల్లెళ్లను తాను ఎపుడూ సిద్ధిపేటలో బయట చూడలేదని, కానీ తనను ఆశీర్వదించటానికి అందరూ వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. కేసీఆర్ దయవల్ల ఇండస్ట్రీలు ఏర్పడటానికి అవసరమైన రైలు, నీళ్ళు, కరెంటు, జాతీయ రహదారులు అన్నీ సమకూరుస్తున్నామని తెలిపారు.
అన్నీ ఉంటే ఇండస్ట్రీలు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నారు. వచ్చే ఐదు సంవత్సరాలలో వీలైనన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి, అందులో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మార్వాడీలందరూ తనకు మద్దతుగా ఆశీర్వాదం ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో సిద్ధిపేటను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అన్ని విషయాలలో తన సంపూర్ణ సహకారం రాజస్థాన్ వాసులకు ఉంటుందని అన్నారు.