సస్యశ్యామలం చేస్తాం

9 Jun, 2016 02:20 IST|Sakshi
సస్యశ్యామలం చేస్తాం

తెలంగాణలో కోటి, జిల్లాలో 5లక్షల ఎకరాలకు సాగునీరివ్వడమే లక్ష్యం
కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు ఎన్ని నిధులైనా కేటాయిస్తాం
ప్రభుత్వ మంచి పనులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదు
తాండూరు కొత్త మార్కెట్ యార్డుకు 40 ఎకరాలు..
మంత్రి మహేందర్‌రెడ్డి  ఏదడిగినా కాదనడం లేదు
రాష్ట్ర నీటిపారుదల శాఖ  మంత్రి హరీష్‌రావు

 

⇔  ‘పాలమూరు’తో జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు
⇔  కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు ఎన్ని నిధులైనా ఇస్తాం
⇔  {పభుత్వ మంచి పనులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదు
⇔  తాండూరు కొత్త మార్కెట్ యార్డుకు 40 ఎకరాలు
⇔  రైతుబజార్‌లో వెజ్, నాన్‌వెజ్ విక్రయాలకు కోల్డ్ స్టోరేజీ 
⇔  మంత్రి మహేందర్‌రెడ్డి ఏదిఅడిగినా కాదనం
⇔  రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు  - తాండూరు

తాండూరు : పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పాలమూరు ప్రాజెక్టును ఆపలేరన్నారు. రంగారెడ్డి జిల్లాలో 5లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఇందులో తాండూరుకు లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. తాండూరు, వికారాబాద్, చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

ఏడాదికి రూ.25లక్షల కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరందించడంమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమెరికాలోని యూనివర్సిటీల నుంచి ఇతర రాష్ట్రాల సీఎంలు, నీటి ఆయోగ్, ప్రధాని కూడా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. భూసేకరణ చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు. 2013 భూసేకరణ చట్టం, 123 జీఓ ప్రకారం ప్రజలు ఏదీ కోరుకుంటే దాని ప్రకారం రూ.5,6లక్షలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఎన్ని నిధులైనా మంజూరు చేయిస్తానని చెప్పారు. మంత్రి మహేందర్‌రెడ్డి అంటే తనకు ఎంతో గౌరవమని.. జిల్లా అభివృద్ధి కోసం ఆయన ఏం అడిగినా కాదనలేదన్నారు.

తాండూరులో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు 30-40 ఎకరాల స్థలం కేటాయించాలని జేసీ రజిత్‌కుమార్ సైనీని మంత్రి ఆదేశించారు. స్థలం కేటాయింపుల తర్వాత రైతులకు అన్ని సౌకర్యాలతో యార్డును నిర్మిస్తామన్నారు. రైతు బజారులో వేర్వేరుగా వెజ్, నాన్‌వెజ్ విక్రయాలకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పడిన బషీరాబాద్, కోట్‌పల్లి మార్కెట్ కమిటీల అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానన్నారు. తాండూరు మార్కెట్‌లో కవర్ షెడ్ల నిర్మాణానికి రూ.83లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేం దర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు మంత్రి హరీష్‌రావు రూ.375కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. కొత్త మార్కెట్ కమిటీల ఏర్పాటుకు మంత్రి ప్రత్యేక చొరవ చూపారన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, వైస్ చైర్మన్ అనంతయ్య, జేసీ రజిత్‌కుమార్ సైని, వికారాబాద్ సబ్ కలెక్టర్ శృతిఓజా, మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం, ఏడీ ఛాయాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సాజిద్‌అలీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, ఎంపీపీలు సాయిల్‌గౌడ్, కోస్గి లక్ష్మి, మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు