చెక్‌డ్యామ్‌లతో 15 టీఎంసీల నిల్వ

15 Mar, 2020 04:56 IST|Sakshi

రూ.3,825కోట్లతో 1,200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం: హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టే లక్ష్యంతో అన్ని వాగులు, వంకలపై రూ.3,825 కోట్లతో 1,200ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తొలి విడతగా 600 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించా రు. ఈ చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో 15 టీఎంసీ నీటి నిల్వ పెరగనుందని, 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని తెలిపారు. శనివారం టీఆర్‌ఎస్‌ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, సంకె రవిశంకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, అవసరమైన ప్రతిచోటా వీటి నిర్మాణాలు జరుగుతాయన్నారు.

6.62 లక్షల మందికి పింఛన్లు: ఎర్రబెల్లి 
ఆసరా పింఛన్లపై ప్రభుత్వం రూ.11,758 కోట్లు ఖర్చు చేయనుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రస్తుత వార్షిక ఏడాదిలో ఖర్చు చేస్తున్న దానికంటే వచ్చే ఏడాది రూ.2,355 కోట్లు అదనంగా ఖర్చు చేస్తామని వెల్లడించారు. 57 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్‌ నుంచి పింఛన్లు అమలు ఇస్తామన్నా రు. ఇప్పటికే కొత్తగా 6.62 లక్షల లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఆ పింఛన్లలో కేంద్రం వాటా కేవలం రూ.203 కోట్లుగా ఉందనిన్నారు. దివ్యాంగులకు ధ్రువపత్రాలు ఇచ్చేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గంలో సదరన్‌ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. సభ్యులు చల్ల ధర్మారెడ్డి, కోరుకంటి చంద్రు లు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.

దోమలు ప్రబలకుండా చర్యలు: ఈటల 
జీహెచ్‌ఎంసీ పరిధిలో డెంగీ జ్వరంతో 7 మంది మాత్రమే చనిపోయారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. మూసీ నది పరీవాహకంలోంచే దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా, ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టమన్నారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిం చిందన్నారు. బీజేపీ సభ్యుడు రాజాసింగ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ, నగరంలో 350 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా ఇప్పటికే 122 దవాఖానాలు పనిచేస్తున్నాయన్నారు. ఇక హరిప్రియ నాయక్‌ అడిగిన మరో ప్రశ్నకు.. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ఇప్పటికే 6.47లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పారు.

మరిన్ని వార్తలు