అండగా ఉంటాం

1 Apr, 2020 01:44 IST|Sakshi
 సిద్దిపేటలో వలస కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు

వలస కార్మికులకు మంత్రి హరీశ్‌రావు భరోసా

గజ్వేల్‌/జోగిపేట/సిద్దిపేటజోన్‌: రాష్ట్రంలో 4 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లిలో వలస కార్మిక కుటుంబాలకు బియ్యం, రూ. 500 నగదు అందజేశారు. అలాగే జోగిపేటలో అధికారులతో సమీక్షించారు. సిద్దిపేటలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 100 నంబరుకు డయల్‌ చేస్తే అధికారులు సాయం చేస్తారని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి ప్రాజెక్టుల్లో పని చేస్తున్న వలస కార్మికులంతా తమ ఆత్మీయులేనని, వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి చెప్పారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.

సరుకుల  పంపిణీ సందర్భంగా ‘భౌతిక దూరం’ పాటించిన వలస కార్మికులు

మరిన్ని వార్తలు