అతిథి భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

7 Jun, 2020 19:37 IST|Sakshi

సాక్షి, గజ్వేల్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో విశ్రాంత ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గజ్వేల్‌లో నిర్మించిన రిటైర్డ్‌ ఉద్యోగుల అతిథి భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ ఇక్కడ నుంచే పోటీ చేసి ముఖ్యమంత్రి కావడం గజ్వేల్‌ ప్రజల అదృష్టమని తెలిపారు. 

కరోనా ప్రపంచాన్ని వణికిస్తుందని.. వర్షాకాలంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన  ప్రజలకు సూచించారు. ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని.. వారిని దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చామని పేర్కొన్నారు. 21 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని.. అందులో భాగంగా గజ్వేల్‌లో ప్రతి వీధిలో మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్ధిపేటను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్ధే బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

>
మరిన్ని వార్తలు