కేసీఆర్‌కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం : హరీష్‌రావు

9 Nov, 2018 15:10 IST|Sakshi

గజ్వేల్‌ : ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు గజ్వేల్‌లో లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని మంత్రి హరీష్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. తూప్రాన్‌ను మున్సిపాలిటీగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పుకొచ్చారు. రీజినల్‌ రింగ్‌ రోడ్‌తో ఈ ప్రాంతం అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. గురువారం తూప్రాన్‌ రోడ్‌షోలో పాల్గొన్న హరీష్‌ రావు రూ 6వేల కోట్లతో గజ్వేల్‌లో ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారన్నారు.

కంటివెలుగులతో పేదలకు వైద్యం దరిచేర్చిన కేసీఆర్‌కు ఓటేయాలని, గజ్వేల్‌ గెలుపుపై అనుమానం లేదని ఇండియా టుడే సర్వే కూడా ఇదే విషయం వెల్లడించిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించి తిరిగి టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపడతుందని హారీష్‌ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. తాగునీరు, విద్యుత్‌ను అందించడంతో పాటు గోదావరి నీటితో తూప్రాన్‌ను సస్యశ్యామలం చేస్తామని అన్నారు.


టీఆర్‌ఎస్‌ది జనం యాత్ర
విపక్షాలు టికెట్ల కోసం జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారిది ఢిల్లీ, అమరావతి యాత్ర అయితే టీఆర్‌ఎస్‌ది జనం యాత్రని అన్నారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్‌, టీడీపీలను గెలిపించినా ఆయా పార్టీలు కనీసం తాగునీటిని సైతం కల్పించలేకపోయాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు