మళ్లింపు జలాల లెక్క తేలుస్తారా?

28 Jun, 2017 02:10 IST|Sakshi

పట్టిసీమ, పోలవరం వాటాలపై చర్చించనున్న బజాజ్‌ కమిటీ
సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ ఆంధ్రప్రదేశ్‌ చేపట్టి న పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో.. ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాల అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. గతేడాది పట్టిసీమ ద్వారా ఏపీ చేసిన వినియోగంలో వచ్చే వాటాలు ఇప్పటికీ తేలకపోవడం, ఈ ఏడాది మళ్లీ వినియోగాన్ని ప్రారంభించడం తెలం గాణకు మంట పుట్టిస్తోంది. ఈ ఏడాదైనా వాటాలు తేల్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచింది.

ఈ నేపథ్యంలో వివాదాన్ని తేల్చేందుకు కేంద్ర జల వనరుల శాఖ ఏర్పాటు చేసిన ఏకే బజాజ్‌ కమిటీ గడువును మరో ఆరు నెలలు పొడగించడం, ఆ కమిటీ వచ్చే నెల మొదటి వారం రాష్ట్రం లో పర్యటించనుండటంతో మళ్లింపు లెక్కలు తేలుతాయా అనేది ప్రశ్నార్థంగా మారింది. ఏటా వాటర్‌ ఇయర్‌కు ముందుగా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నా ఇంతవరకు గోదావరి మళ్లింపు జలాల వివా దం తేలలేదు.

ఈఏడాది ఫిబ్రవరిలో ఒకసా రి రాష్ట్రానికి కమిటీ రాగా.. పట్టిసీమ, పోల వరం ప్రాజెక్టుల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా 73 (పోలవరం 43 టీఎంసీలు, పట్టిసీమ 30 టీఎంసీలు) టీఎంసీలు తమకు దక్కేలా చూడాలని తెలం గాణ కోరింది. కమిటీ స్పందిస్తూ, మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చెతులెత్తేసింది. దీనిపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో బజాజ్‌ కమిటీతో కేంద్రం చర్చించి మళ్లింపు జలాలపై మధ్యేమార్గాన్ని సూచించాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు