వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: జ్వరాలన్నీ డెంగీ, స్వైన్ ఫ్లూ కాదని..ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. సీజనల్ వ్యాధులపై బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.విష జ్వరాలువ్యాపించకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఫీవర్ ఆసుప్రతుల్లో సాయంత్రం కూడా ఓపీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. డెంగీ మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆగస్టులో 62 మందికి మాత్రమే డెంగీ నిర్ధారణ అయ్యిందని...అందరూ కోలుకున్నారన్నారు.
విష జ్వరాల నివారణ చర్యల్లో ఇబ్బందులుంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఈటల సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. విష జ్వరాలపై ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. నగరాన్నిపరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించే బాధ్యత జీహెచ్ఎంసీ దేనని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు మల్లారెడ్డి, మహముద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్, హెల్త్ అధికారులు పాల్గొన్నారు.