3 వేల సీట్లు.. 24 వేల దరఖాస్తులు!

19 Apr, 2018 03:30 IST|Sakshi

బీసీ గురుకుల కళాశాలలకు తీవ్రపోటీ

మెరుగైన ఫలితాలతో పెరుగుతోన్న ఆదరణ 

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు.. 26న రాత పరీక్ష

సాక్షి, హైదరాబాద్‌: బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కాలేజీలకు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల ఆయా కాలేజీలు సాధించిన మెరుగైన ఫలితాలతో వాటి పరపతి మరింత పైకి ఎగబాకుతోంది. తాజాగా ఈ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సైతం రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 19 బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలున్నాయి. ఒక్కో కాలేజీలో నాలుగు కోర్సులకు సంబంధించి 160 చొప్పున 3,040 సీట్లున్నాయి. వీటికి సంబంధించి రెండ్రోజుల క్రితం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది.

నాలుగు కోర్సులకు సంబంధించి 24,327 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీసీ కేటగిరీలో 11 వేల మంది, బైపీసీలో 10 వేల మంది, సీఈసీలో 3 వేల మంది, ఎంఈసీలో దాదాపు వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు బీసీ గురుకులాల సొసైటీ ఈ నెల 26న రాతపరీక్ష నిర్వహించనుంది. సొసైటీ వెబ్‌సైట్‌లో విద్యార్థులకు హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. రాతపరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు పేర్కొన్నారు. 

డిగ్రీ కాలేజీల్లోనూ... 
మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల సొసైటీ పరిధి లో రెండు మహిళా డిగ్రీ కాలేజీలున్నాయి. వీటి పరి ధిలో డిగ్రీ ఫస్టియర్‌ కేటగిరీలో 240 సీట్లకు సంబం ధించి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ గతవారం ముగిసింది. 5,589 మంది విద్యార్థులు దరఖాస్తు లు సమర్పించారు. వీరికి రాతపరీక్ష ఈ నెల 26నే నిర్వహించేందుకు సొసైటీ ఏర్పాట్లు చేసింది. హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

మరిన్ని వార్తలు