సిటీలో కుండపోత.. అర్ధరాత్రి దాకా ట్రాఫిక్ జామ్
నగర రహదారులన్నీ జలమయం
భారీగా స్తంభించిన ట్రాఫిక్.. తీవ్రంగా ఇబ్బందిపడ్డ వాహనదారులు
పలు జిల్లాల్లోనూ భారీ వర్షం
యాచారంలో 13సె.మీ.ల భారీ వర్షం
సాక్షి, నెట్వర్క్ : గ్రేటర్ హైదరాబాద్లో మంగళవారం కురిసిన జడివాన బీభత్సం సృష్టించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులపై వరద పోటెత్తింది. నడుము లోతు నీరు ప్రవహించడంతో వాహనాలు భారంగా ముందుకు కదిలాయి. ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న 24 గంటల్లో హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని రహదారులు జలమయం అయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మాదాపూర్లోని ప్రధాన రహదారి, కృష్ణానగర్ పరిసరాలు, చెరువును తలపించాయి. ఆయా ప్రాంతాల్లో బైక్లు, కార్లు వరద నీటిలో మునిగిపోయాయి.
నగరంలో వర్షపాతం సెంటీ మీటర్లలో..
సికింద్రాబాద్లోని సిఖ్ విలేజ్లో నిలిచిన వర్షపు నీరు
ఉప్పల్–వరంగల్ రహదారిపై..
ఉప్పల్–వరంగల్ ప్రధాన రహదారిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరంగల్ రహదారిపై ఎలక్ట్రికల్ జంక్షన్ వద్ద నీరు నిలిచిపోవడంతో జిల్లాల నుంచి వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కృష్ణశేఖర్ అత్యవసర టీమ్తో వచ్చి వరద నీటిని తొలగించేందుకు ప్రయత్నించారు. ఈసీఐఎల్, కుషాయిగూడ, చర్లపల్లి, హెచ్బీకాలనీలల్లోనూ రోడ్లన్నీ జలమయమయ్యాయి.
బోయిన్పల్లి చౌరస్తాలో వర్షం కారణంగా స్తంభించిన ట్రాఫిక్
గుడిమల్కాపూర్లో పరిస్థితి ఇలా
పలు జిల్లాల్లోనూ..
తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. కరీంనగర్లో ఏకంగా దాదాపు నాలుగు గంటల పాటు వాన పడింది. వర్షపు ధాటికి అంబేడ్కర్నగర్కు చెందిన రవూఫ్ అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో కురిసిన వర్షాలకు జినిగాల వాగు పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, పెద్దపల్లిలో గంటన్నర పాటు కురిసిన కుండపోత వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు భారీ వర్షం కురిసింది. కోఠి కళాశాల నుంచి ఎంజీబీఎస్ వరకు నీళ్లల్లో బస్సులు, బైక్లు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. ఈ ప్రాంతంలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండటంతో నీరు నిలిచింది. అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల వల్ల అధిక వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 589 మండలాల్లో ఈ సీజన్లో ఇప్పటివరకు 359 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 122 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇంకా 108 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా యాచారంలో 13 సెం.మీ. వర్షం కురిసింది.
వేములవాడలో చెరువును తలపిస్తున్న రహదారి
(హైదరాబాద్ ను కుదిపేసిన జడివాన.. దృశ్యాల కోసం... క్లిక్ చేయండి)