శుభ్రత విషయంలో రాజీపడొద్దు

24 Mar, 2020 03:04 IST|Sakshi

క్వారంటైన్‌ గదులను శుభ్రంగా ఉంచండి 

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అంతర్జాతీయ విమాన ప్రయాణికులను 14 రోజుల పాటు ఉంచే క్వారంటైన్‌ గదులను శుభ్రంగా ఉంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శుభ్రత విషయంలో ఏ మాత్రం రాజీపడొద్దని స్పష్టం చేసింది. క్వారంటైన్‌ గదులుగా వసతి గృహాలను వినియోగిస్తున్నప్పుడు, ఆ గదుల్లో ఒక్కరినే ఉపయోగించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. క్వారంటైన్‌ గదులు శుభ్రంగా ఉండటం లేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలిచిన హైకోర్టు.. సోమవారం విచారణ జరిపింది. 

ప్రభుత్వాన్ని సంప్రదించండి.. 
కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా విదేశాల నుంచి వచ్చిన వారిని జియోట్యాగ్‌ ద్వారా గుర్తించే విషయంలో సాంకేతిక సాయం అందించడంపై ప్రభుత్వాన్ని సంప్రదించాలని కంటైన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు హైకోర్టు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉంటున్న వారిని గుర్తించేందుకు వీలుగా ఓ యాప్‌ రూపొందించామని, కరోనా వ్యాప్తి నిరోధంలో తమ వంతు సాయం అందిస్తామంటూ కంటైన్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది. 

మరిన్ని వార్తలు