మూల్యాంకనం వాయిదాకు హైకోర్టు ‘నో’

13 May, 2020 07:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షల మూల్యాంకనాన్ని వాయిదా వేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. లాక్‌డౌన్‌ పూర్తిగా తొలగించే వరకూ ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ నిర్వహించరాదనే అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇంటర్‌ పరీక్షల ఫలితాలకూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉన్నత విద్య ప్రవేశాలకు ముడిపడి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో మూల్యాంకనం వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. (ఏది పడితే అది పండించొద్దు: సీఎం కేసీఆర్‌)

లాక్‌డౌన్‌ పూర్తయ్యే ఈ నెల 29 వరకూ మూల్యాంకనం నిర్వహించరాదని కోరుతూ సిద్దిపేటకు చెందిన సామాజిక కార్యకర్త ఓంప్రకాష్‌ భోజన విరామ సమయంలో దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యాన్ని మంగళవారం ధర్మాసనం విచారించింది. రాష్ట్రంలోని 9.65 లక్షల మంది ఇంటర్‌ విద్యార్థుల పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేసుకోవచ్చునని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు