మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

7 Jan, 2020 18:54 IST|Sakshi

కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణలోని మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు లైన్‌క్లియర్‌ అయింది. ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషనర్‌ విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం కొట్టివేసింది. దీంతో యథావిధిగా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా మున్సి పల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం తాము ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇవ్వొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సోమవారం హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్‌ అయింది. కాసేపట్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడాన్ని తప్పుపడుతూ టీపీసీసీ చీఫ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంను కూడా హైకోర్టు కొట్టివేసింది.

మరిన్ని వార్తలు