ఆన్‌లైన్‌ క్లాస్‌ల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

3 Jul, 2020 15:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ క్లాసుల‌ నిర్వహణ పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం దీనిపై ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించకపోవడంతో హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని ఇంకా ప్రారంభించలేదని క్యాబినెట్‌ సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ఎందుకు నిర్వహిస్తున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అంతేగాక ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల ఆర్థికంగా వెనుకబడిన వారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో ఈ నెల 13వ తేదీలోగా లిఖితపూర్వకంగా నిర్థిష్ట ప్రణాళికను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. (‘కొత్త బిల్లుతో మూడు రకాల నష్టాలున్నాయి’)

అదే విధంగా ఆన్‌లైన్‌ క్లాసెస్‌పై ఇండిపెండెంట్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోషియేషన్‌ ఇంప్లీడ్‌(ఇస్మా) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సీబీఎస్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు నెలల క్రితమే విద్యా సంవత్సరం ప్రారంభించిందని ఇస్మా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం లేదని, ఇది వారికి ఆప్షన్‌ మాత్రమేనని ఇస్మా పిటిషన్‌లో పేర్కొంది. సీబీఎస్ఈపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని ఇస్మా న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. పూర్తి​ వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఇస్మాకు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. (కరోనా పరీక్షలు నిలిపేస్తున్నామని ఎలా చెబుతారు?)

మరిన్ని వార్తలు