వారానికి మూడు రోజులే హైకోర్టు

17 Mar, 2020 04:02 IST|Sakshi

కరోనా వ్యాప్తి నివారణకు నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌:  న్యాయస్థానాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు హైకోర్టు చర్యలు ప్రారంభించింది.  సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది.   ఈ సందర్భంగా కోర్టుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. తర్వాత హైకోర్టు, జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల విషయంలో హైకోర్టు రిజిస్టార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు, ఇతర కోర్టుల బార్‌ అసోసియేషన్లను మూసేయాలని పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాలు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు.

ఇవీ నిర్ణయాలు:  హైకోర్టు ఇకపై ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో వారానికి మూడురోజులు మాత్రమే పనిచేస్తుంది. ఊ ఉగాది 25న బుధవారం వచ్చినందున ఆ రోజుకు బదులు 26న పనిచేస్తుంది. ఊ  అన్ని స్థాయి కోర్టుల్లోనూ కక్షిదారులు న్యాయస్థానానికి రాకూడదు. కేసుకు సంబంధం ఉన్న లాయర్‌నే కోర్టు హాల్లోకి అనుమతిస్తారు. ఊ ఇతర న్యాయవాదులు కోర్టు కారిడార్లకే పరిమితమవ్వాలి. ఊ గతంలో వివిధ కేసుల్లో జారీ చేసిన స్టే ఉత్తర్వుల గురిం చి కోర్టుల దృష్టికి తీసుకువచ్చి వాటి పొడిగింపునకు లాయర్లు ప్రయత్నించాలి. కోర్టులు స్పందించకపోతే పరిణామాలు చేయిదాటేలా ఉంటాయన్న కేసులను మాత్రమే విచారిస్తాయి. ఊ న్యాయవాదులు కోర్టులోకి వచ్చేముందు బయట ఏర్పాటు చేసే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి.

ఊ కోర్టు ధిక్కార కేసుల్లో వ్యక్తిగత హాజరు కావాలన్న ఉత్వర్వులు తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ అమలు కావు.  ఊ కోర్టు ధిక్కార కేసుల్లో వ్యక్తిగత హాజరుపై తాజాగా వెలువడిన ఈ ఉత్తర్వులను అడ్వొకేట్‌ జనరల్‌ కార్యాలయం సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ఊ అన్ని రకాల పిటిషన్ల దాఖలుకు  వీలుంటుంది. అత్యంత ముఖ్యమైన కేసులను మాత్రమే కోర్టులు విచారిస్తాయి.  ఊ హైకోర్టు సిబ్బందికి బయోమెట్రిక్‌  రద్దు చేశారు. వారంతా రిజిస్టర్లలో సంతకాలు పెట్టాలి.  ఊ బార్‌ అసోసియేషన్, మహిళా న్యాయవాదుల భోజనశాలల్ని మూసివేయాలి. ఊ జడ్జీల వద్ద పనిచేసే లా క్లర్కులు తిరిగి ఉత్తర్వులిచ్చే వరకూ విధులకు హాజరు కానవసరం లేదు. ఊ కింది కోర్టుల్లో బెయిల్, ఇంజక్షన్, రిమాండ్‌ కేసులకు ప్రాధాన్యత ఇచ్చి వాటినే విచారించాలి. ఇతర కేసుల్ని 3 వారాలపాటు వాయిదా వేయాలి.  ఊ వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎవరు కోరినా కింది కోర్టు సానుకూలంగా ఉండాలి. 

మరిన్ని వార్తలు