హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, మీర్పేట పరిధిలోని లెనిన్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం అక్కడఉన్న పక్కా ఇళ్ల కూల్చివేతకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది. ఇళ్ల కూల్చివేత వ్యవహారంలో యథాతథ స్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. లెనిన్నగర్లోని మూడెకరాల భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించేందుకు పక్కనే ఉన్న తమ ఇళ్లను సైతం కూల్చివేస్తుండటాన్ని సవాలు చేస్తూ ఆర్.శారద మరో 12మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పిటిషనర్లు వాదనలు వినిపిస్తూ సర్వే నంబర్ 118లో ఎన్నో సంవత్సరాలుగా తాము ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని తెలిపారు.
ప్రభుత్వం తమకు నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించిందని, తాము పన్నులు కూడా చెల్లిస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు తమ ఇళ్లను కూల్చేస్తున్నారని వివరించారు. తమ ఇళ్ల పక్కన ఉన్న భూమిలో నిర్మాణాలపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే తమ ఇళ్లను మాత్రం కూల్చివేయడం అన్యాయమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఇళ్ల కూల్చివేతపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.