ధర్నాచౌక్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

13 Nov, 2018 16:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందిరా పార్క్‌ వద్ద​ ధర్నాచౌక్‌ను కొనసాగించాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందనే కారణంతో ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నిరసనలు తెలుపడంపై నిషేధం విధించారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి హనుమంతరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాచౌక్‌ను యథావిధిగా కొనసాగించాలని ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాచౌక్‌ పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆరు వారాల వరకు ధర్నా చౌక్‌ను యథావిధిగా కొనసాగించాలని న్యాయస్థానం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆరు వారాలు పరిశీలించిన తర్వాత ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని తెలిపింది. ఇకపై ధర్నా చౌక్‌లో యథావిధిగా నిరసనలు తెలుపడానికి కోర్టు అనుమతినిచ్చింది.

మరిన్ని వార్తలు