యాదాద్రిలో సదుపాయాలెలా ఉన్నాయి..?

12 Jul, 2017 00:08 IST|Sakshi
యాదాద్రిలో సదుపాయాలెలా ఉన్నాయి..?

తెలియజేయాలని దేవాదాయ శాఖకు హైకోర్టు ఆదేశం
‘సాక్షి’ పత్రికలో వార్త.. పిల్‌గా స్వీకరణ


సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తులకు కల్పించే కనీస సౌకర్యాలు, వైద్య సదుపాయా ల కల్పన ఏవిధంగా ఉందో తెలియజేయాలని తెలం గాణ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. యాదగిరిగుట్టలోని భక్తులు స్నానమాచరించే గుండంలో పడి గత నెల 3న పదేళ్ల బాలుడు మృతి చెందాడు. ‘విష్ణు పుష్కరిణిలో పడి బాలుడి మృతి’ పేరిట జూన్‌ 4న ‘సాక్షి’లో వచ్చిన వార్తను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఈ పిల్‌ను మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం విచారించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా షాన్‌పల్లికి చెందిన చెవ్వొల బాలస్వామి కుమారుడు శివకుమార్‌ హైదరాబాద్‌లో ఉండే మేనమామ వీరయ్యతో కలసి యాదాద్రికి వెళ్లాడు.

స్నానం చేసేందుకు గుండంలోకి దిగిన బాలుడు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో మునిగిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం యాదాద్రిలో భక్తుల సౌకర్యాలు ఏవిధంగా ఉన్నా యో, వైద్య సదుపాయాల కల్పన ఎలా ఉందో తెలపాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు