చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు
ఉత్సవాలకు హాజరుకానున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: శతాబ్ది ఉత్సవాలకు హైకోర్టు ముస్తాబవుతోంది. ఈ నెల 20న హైకోర్టు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్ సుభాష్రెడ్డి హాజరుకానున్నారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
1920 ఏప్రిల్ 20న ప్రారంభం..
ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ 1920 ఏప్రిల్ 20వ తేదీన మూసీనది ఒడ్డున ఈ హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. జైపూర్కు చెందిన ఇంజనీర్, ఆర్కిటెక్ట్ శంకర్లాల్ హైకోర్టు నమూనాను తయారు చేశారు. హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ మెహర్ అలీ ఫజల్ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. రూ.18.22 లక్షల అంచనా వ్యయంతో హైకోర్టు భవన నిర్మాణ కాంట్రాక్ట్ను నవరతన్ దాస్ దక్కించుకున్నారు. ఇండో ఇస్లామిక్ సంప్రదాయ రీతిలో హైకోర్టు భవనాన్ని నిర్మించారు. ఆరుగురు జడ్జీలు, న్యాయవాదుల సంఘం పనిచేసేలా భవన నిర్మాణం జరిగింది. 1956లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 11 మంది జడ్జీలతో ఈ భవనం నుంచే కార్యకలాపాలు ప్రారంభించింది. హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు వ్యవహరించారు.
వైఎస్సార్ హయాంలో విస్తరణ..
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైకోర్టు విస్తరణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించారు.