సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఒలంపిక్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఒలంపిక్ సంఘం ఎన్నికలు హైదరాబాద్లోనే నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. తెలంగాణ ఒలింపిక్ భవన్, సంఘం కార్యాలయం అన్నీ ఇక్కడే ఉంచుకుని ఎన్నికలు న్యూఢిల్లీలో నిర్వహిస్తామంటే కుదరదని జస్టిస్ వినోద్ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా తయారీపై కూడా హైకోర్టు ధర్మాసనం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తివి మరోసారి అదే పదవికి ఎలా పోటీ చేస్తావని జగదీష్ యాదవ్ను న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల తతంగం లోపభూయిష్టంగా, విమర్శలకు తావిచ్చేదిగా ఉందంటూ హైకోర్టు జగదీష్ వర్గానికి అక్షింతలు వేసింది.కాగా, రేపు ఓటర్ల జాబితా, ఎన్నికల అధికారి నియామకం, జయేష్ నామినేషన్పై కూడా అరిసనపల్లి జగన్మోహన్ రావు రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.