అవగాహనతోనే వేధింపులకు చెక్‌

5 Dec, 2019 02:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహిళల భద్రత–రక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, అప్పుడే వేధింపుల నివారణ సాధ్యమని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ‘దిశ’ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం హోంమంత్రి కార్యాలయంలో పలువురు మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు. మహిళల భద్రతకు అనుసరించాల్సిన వ్యూహాలు, వారిపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం చర్చించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఐజీ– షీటీమ్స్‌ స్వాతి లక్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే.. 

  • మహిళలు అదృశ్యమైన కేసుల్లో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే కేసులు నమోదు చేయాలి. 
  • పోలీస్‌స్టేషన్ల పరిధులతో సంబంధం లేకుండా ముందు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలి. 
  • షీటీమ్స్‌ మరింత బలోపేతానికి హాక్‌ ఐ వినియోగాన్ని పెంచేలా ప్రోత్సహించాలి. 
  • హెల్ప్‌లైన్లు, పోలీసు యాప్స్‌ వినియోగం పెరిగే లా మహిళల్లో అవగాహన కల్పించాలి. 
  • డయల్‌ 100, 181, 1098, 112 హెల్ప్‌లైన్‌ నెంబర్లను విద్యాసంస్థల్లో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే, మెట్రో, పార్కులు, ఆటో, క్యాబ్‌ల్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ప్రదర్శించాలి. 
  • బాలబాలికలు, ఉద్యోగులకు వేధింపులు లింగసమానత్వంపై అవగాహన తీసుకువచ్చేందుకు ఈ–లెర్నింగ్‌ కోర్సులు అందుబాటులోకి తేవాలి. 
  • సినిమాహాళ్లు, టీవీల్లో లఘుచిత్రాలు, స్లైడ్లు ప్రదర్శించాలి. 
  • షీటీమ్స్‌తో కలిసి విద్యాసంస్థల్లో అమ్మాయిలపై వేధింపులపై అవగాహన కల్పించే సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ. 
  • గ్రామం నుంచి జిల్లా స్థాయివరకు అంగన్‌వాడీ, ఆశా, సెర్ఫ్‌ తదితర సంఘాలను మహిళా భద్రతపై ప్రచారానికి వినియోగించాలి. 
  • పిల్లలు నడుచుకుంటున్న విధానంపై తల్లిదండ్రులతో స్కూలు ఉపాధ్యాయులు చర్చించాలి.   
మరిన్ని వార్తలు