అతివేగానికి ఇద్దరి బలి

20 Apr, 2014 01:27 IST|Sakshi
అతివేగానికి ఇద్దరి బలి
  •     ‘ఔటర్’పై ప్రమాదానికి గురైన టాటా ఏస్ వాహనం
  •      డ్రైవర్ తో పాటు యువకుడి మృతి
  •      మరో యువకుడికి తీవ్రగాయాలు
  •  రాజేంద్రనగర్, న్యూస్‌లైన్: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో యువకుడిని తీవ్రగాయాల పాల్జేసింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం ఈ దుర్ఘటన జరిగింది.  నార్సింగి పోలీసుల కథనం ప్రకారం... సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన మహ్మద్ ముక్తార్(27) గూడ్స్ వాహనాల డ్రైవర్. శనివారం ఉదయం టాటా ఏస్ వాహనంలో వేస్ట్ ఆయిల్ డ్రమ్ములను తీసుకుని కొల్లాపూర్ మీదుగా శంషాబాద్‌కు బయలుదేరాడు.

    ఇతనికి సహాయకులుగా సింగరేణి కాలనీకి చెందిన అఫ్సర్‌ఖాన్(28), మహ్మద్ అమీర్(27)లు వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు కోకాపేట్ టోల్‌గేట్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. డ్రైవర్ ముక్తార్, అఫ్సర్‌ఖాన్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.  అమీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

    విషయం తెలుసుకున్న వెంటనే నార్సింగి పోలీసులు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో ఇరుక్కున్న ఇరువురి మృతదేహాలతో పాటు గాయపడ్డ అమీర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అమీర్ చావుబతుకుల మధ్య చికిత్సపొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
     

మరిన్ని వార్తలు