రాజధానిలోనే అధిక నీటి వినియోగం 

4 Jun, 2019 02:27 IST|Sakshi

హైదరాబాద్‌లో ఏకంగా 341 శాతం నీటి వినియోగం 

భూగర్భ జల శాఖ నివేదికలో వెల్లడి  

నివేదిక విడుదల చేసిన సీఎస్‌ జోషి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం మొత్తంలో రాజధాని హైదరాబాద్‌ భూగర్భ జలాల వినియోగంలో తొలి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఏకంగా భూగర్భ జల వినియోగం 341 శాతంగా ఉంది. రాష్ట్ర సరాసరి వినియోగం 65 శాతం ఉండగా, దానికి ఐదింతలు ఎక్కువగా హైదరాబాద్‌లో వినియోగం ఉన్నట్లు భూగర్భజల శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో మల్కాజ్‌గిరి (94 శాతం), సిద్దిపేట (94 శాతం), మేడ్చల్‌ (92 శాతం), వరంగల్‌ అర్బన్‌ (91శాతం)గా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ భూగర్భ జల శాఖ, కేంద్ర జల వనరుల సంస్థల సమన్వయంతో రాష్ట్రంలో భూగర్భ జల వనరులు 2016–17 నీటి సంవత్సరానికి సంబంధించిన నివేదికను రూపొందించాయి.

ఈ నివేదికను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్, తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రకాశ్, భూగర్భజల శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ పండిత్‌ మద్నూర్‌లు విడుదల చేశారు. రాష్ట్రాన్ని మొత్తంగా 502 గ్రౌండ్‌ వాటర్‌ బేసిన్లుగా విభజించి భూగర్భ జలాలను అంచనా వేశారు. ఇందులో 29 బేసిన్‌లు అత్యధిక భూగర్భ నీటిని వినియోగిస్తున్నట్లు తేల్చారు. 8,584 మండలాలకు 70 మండలాలు అత్యధిక భూగర్భ నీటిని వినియోగిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అత్యధిక నీటి వినియోగం ఉన్న ప్రాంతాలు, మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా జోషి అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.   

మరిన్ని వార్తలు