భిన్న రూపాల్లో హిందూ ఫాసిజం

8 Apr, 2018 03:26 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న అరుంధతీరాయ్‌

రచయిత అరుంధతీరాయ్‌  

హైదరాబాద్‌: దేశంలో సంక్లిష్టమైన పరిస్థితి ఉందని, హిందూ ఫాసిజం విస్తృతంగా ముందుకు సాగుతోందని ప్రముఖ రచయిత, సామాజికవేత్త అరుంధతీరాయ్‌ అన్నారు. హిందూ ఫాసిజం భిన్నమైన రూపాల్లో అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, బీజేపీ మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తుందన్నారు. గోరక్షణ పేరుతో దళితులను చంపుతున్నారని విమర్శించారు. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌లో అమిత్‌షా పాత్ర ఉందని సీబీఐ విచారణ చేసిందని, ఈ కేసును జస్టిస్‌ లోయాకు విచారణకు అప్పగించగా అత ను అనుమానాస్పద రీతిలో మృతి చెందా రన్నారు. అమిత్‌షాను కాపాడటానికే లోయా ను హత్య చేశారనే ఆరోపణలున్నాయన్నారు.  

న్యాయవ్యవస్థను కూడా వదలట్లేదు.. 
భూమి, పర్యావరణం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారని అరుంధతీరాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో హిందుత్వాన్ని జోడిస్తున్నారని, చివరికి న్యాయ వ్యవస్థను కూడా వదల్లేదన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే మాట్లాడుతూ, ప్రైవేట్‌ యూనివర్సిటీల వల్ల చదువుకోవటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. విద్యార్థి రాజకీయాలు లేకపోవటం వల్ల ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉందని, కలిసి పంచుకునే భావజాలం లేదన్నారు. విలువల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్‌.నారాయణరావు, ప్రొఫెసర్‌ నందిని సుందర్, ప్రొఫెసర్‌ హరగోపాల్, ప్రొఫెసర్‌ శేషయ్య, వి.రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు