‘దత్తపుత్రుడు’ రామప్ప

26 Apr, 2018 03:24 IST|Sakshi

దత్తతకు చారిత్రక కట్టడాలు..

రామప్ప కోసం ముందుకొచ్చిన కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు

అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పించాలని కేంద్రం లేఖ

చార్మినార్, గోల్కొండ కోటలనూ దత్తత ఇవ్వనున్న కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: చారిత్రకంగా ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు నిధుల్లేక అభివృద్ధికి నోచు కోవట్లేదు. ఈ నేపథ్యంలో చారిత్రక నిర్మాణాలను దత్తతకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయిం చింది. దశల వారీగా ముఖ్యమైన కట్టడాలను కార్పొరేట్‌ సంస్థలకు దత్తత ఇవ్వాలని భావి స్తోంది. సామాజిక బాధ్యత కింద కార్పొరేట్‌ సంస్థలు చారిత్రక కట్టడాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఇందు లో భాగంగా తొలుత రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్‌ల దత్తతకు సంబం ధించి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృ తిక శాఖ, కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థలు దీన్ని జారీ చేశాయి. దీనికి జీఎమ్మార్, కాక తీయ హెరిటేజ్‌ ట్రస్టులతో పాటు మరికొన్ని సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ ఆయా సంస్థలకు లేఖలు అందజేసింది. రామప్ప దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు సంబంధించి మూడు వారాల్లో ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రపర్యాటక శాఖ సహాయ మంత్రి అల్ఫోన్స్‌ సమక్షంలో కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ ప్రతినిధి పాండురంగారావుకు అధికారులు లేఖ అందజేశారు. జీఎమ్మార్‌ సంస్థ కూడా గతంలో ప్రతిపాదన సమర్పించింది. మూడువారాల్లో వచ్చే ప్రతిపాదనలు పరిశీలించి దత్తత సంస్థను కేంద్రం అధికారికంగా ప్రకటిస్తుంది.

దత్తత తీసుకుని ఏం చేస్తారు..?
రామప్ప దేవాలయం ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణాల్లో ఒకటి. నాటి ఇంజనీరింగ్‌ అద్భుతానికి నిలువెత్తు నిదర్శనం. నిర్మాణ బరువును తగ్గించేందుకు నీటిలో తేలే ఇటుకలను రూపొందించి ఈ గుడిని నిర్మించారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడుతోంది. కానీ ఆ అద్భుత నిర్మాణం వద్ద పర్యాటకులకు కనీస వసతుల్లేవు. సరైన రోడ్డు వసతి లేదు. ప్రస్తుతం ఆ కట్టడం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ అధీనంలో ఉండగా, నిర్మాణ పర్యవేక్షణకు మాత్రమే నిధులు విడుదల చేస్తూ సంరక్షిస్తోంది. కానీ పర్యాటకులకు వసతులు కల్పించటం సాధ్యం కావ టం లేదు. మంచి రోడ్డు, పచ్చిక బయళ్లు, లైటింగ్‌ వ్యవస్థ, సౌండ్, లైట్‌ షో లాంటి ఏర్పాట్లు చేయాలన్నా నిధుల కొరత వేధిస్తోంది. దీంతో సామాజిక బాధ్యత కింద కార్పొరేట్‌ సంస్థల నుంచి విరాళాలు సేకరించి ఆ పనులు చేపట్టబోతోంది. దత్తతకు తీసుకునే సంస్థ ఆ నిధుల జమ బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పనులు మాత్రం పురావస్తు శాఖ నిర్వహిస్తుంది.

మరిన్ని వార్తలు