శరవేగంగా హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌

1 Oct, 2018 09:30 IST|Sakshi
పనులను పరిశీలిస్తున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

అధికారులకు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సూచన

సైబర్స్‌ టవర్స్‌ నుంచి రహేజా మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వరకు పనుల పరిశీలన

సాక్షి,సిటీబ్యూరో: హైటెక్‌సిటీ వరకు మెట్రో కారిడార్‌ ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని హైదరాబాద్‌ మెట్రో రైలు మేనేజింగ్‌డైరెక్టర్‌ ఎన్వీఎస్‌రెడ్డి మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ అధికారులను ఆదేశించారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సూచనల మేరకు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పనులను  పూర్తి చేయాలన్నారు. ఆదివారం సైబర్‌టవర్స్‌ నుంచి రహేజా మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వరకు జరుగుతున్న మెట్రో పనులు,హైటెక్‌సిటీ స్టేషన్, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ ప్రాంతాల్లో చేపట్టిన సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతంపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

సైబర్‌టవర్స్,శిల్పారామం ఫ్లైఓవర్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న మెట్రో పిల్లర్లను ప్రధాన రహదారి మధ్యలో కాకుండా పక్కన ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతంలో పిల్లర్ల ఏర్పాటు పనులను ఇంజినీరింగ్‌ సవాళ్లను అధిగమించాలి.
హైటెక్‌సిటీ–ట్రైడెంట్‌ హోటల్‌ మార్గంలో 22 మెట్రో పిల్లర్లు, వయాడక్ట్‌ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి. ఈ పనుల పూర్తితో మెట్రో రైలు రివర్సల్‌ సదుపాయం ఏర్పాటు కానుంది. ఈ పనుల పూర్తికి ప్రధాన రహదారిని మూసివేసి ట్రాఫిక్‌ డైవర్షన్‌ చేసేందుకు సహకరించాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌కు సూచించారు.
తాత్కాలికంగా సైబర్‌టవర్‌ జంక్షన్‌ నుంచి సైబర్‌ టవర్‌ గేట్‌వే జంక్షన్‌ మార్గంలో ప్రధాన రహదారిని మూసివేయడం లేదా పాక్షికంగా తెరిచే ఏర్పాటు చేయాలి. సైబర్‌టవర్స్‌ ఫ్లైఓవర్‌ను సైబర్‌గేట్‌వే వరకు వన్‌వే ఫ్లైఓవర్‌గా చేయాలి. ఈ మార్గంలో ట్రాఫిక్‌ను డెలాయిట్‌ ఎక్స్‌రోడ్‌–ఒరాకిల్‌ జంక్షన్‌–గూగుల్‌ఎక్స్‌రోడ్‌–హైటెక్స్‌–శిల్పారామం–హైటెక్‌సిటీ జంక్షన్‌ మీదుగా మళ్లించాలి.

ట్రాఫిక్‌ దారి మళ్లించేందుకు ప్రత్యామ్నాయ రహదారులను యుద్ధప్రాతిపదికన హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ అధికారులు అభివృద్ధి చేయాలి.
సైబర్‌టవర్స్‌ వద్ద 2 పోర్టల్‌ పిల్లర్ల నిర్మాణ పనులను తక్షణం పూర్తిచేయాలి.
ఈ పిల్లర్ల నిర్మాణ సమయంలో ట్రాఫిక్‌నుదారిమళ్లించాలి.
పోర్టల్‌ పిల్లర్ల నిర్మాణం తరువాత సాధారణ మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేసేందుకు ట్రైడెంట్‌ హోటల్‌ వద్ద ప్రధాన రహదారిని విస్తరించాలి.
మెట్రో పిల్లర్ల ఏర్పాటు అనంతరం దెబ్బతిన్న రహదారిని తక్షణం పునరుద్ధరించాలి. ట్రాఫిక్, ఎల్‌అండ్‌టీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి.
మెట్రో పిల్లర్లకు ఫౌండేషన్లు ఏర్పాటైన చోట ఎల్‌అండ్‌టీ సిబ్బంది బార్‌కేడ్‌లను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలి.
హైటెక్‌సిటీ స్టేషన్‌ నుంచి ట్రైడెంట్‌ హోటల్‌ వరకు 650 మీటర్ల మేర ఏర్పాటుచేయనున్న రివర్సల్‌ ట్రాక్‌ ఏర్పాటుకు స్ట్రక్చరల్,ట్రాక్, సిగ్నలింగ్, ఎలక్ట్రికల్‌ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి.

సుందరీకరణ పనుల పరిశీలన..
జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, పెద్దమ్మదేవాలయం, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్‌ పనులను ఎల్‌అండ్‌టీ అధికారులు తక్షణం పూర్తిచేయాలి.
దుర్గం చెరువు స్టేషన్‌ వద్ద ఇప్పటికే మెట్రో పనుల కోసం సేకరించిన ఆస్తులను టౌన్‌ప్లానింగ్‌ విభాగం అడ్డు తొలగించాలి.
అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ మార్గంలోని ఐదు మెట్రో స్టేషన్ల వద్ద మిగిలిన పనులను, సుందరీకరణ పనులను తక్షణం పూర్తిచేయాలి.

>
మరిన్ని వార్తలు