లాస్ట్‌ ఛాన్స్‌ ఫీజు ప్లీజ్‌!

10 Dec, 2019 07:46 IST|Sakshi

ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌కు

ముగియనున్న గడువు

ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) కింద దరఖాస్తులు క్లియరైనవారు ఫీజు చెల్లించాలంటూ సంక్షిప్త సందేశాలు పంపుతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు డిసెంబర్‌ 31తో ముగుస్తుందని నవంబర్‌ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫీజు వసూలుపై బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలని సమాచారం అందుకున్నవారు దాదాపు 10 వేల మందికి పైగా ఉన్నారు. వీరు ఆ మొత్తం చెల్లిస్తే హెచ్‌ఎండీఏ ఖజానాకు దాదాపు రూ.90 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి కాకుండా వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు కూడా క్లియర్‌ చేస్తే మరో రూ.40 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది. దీంతో అధికారులు ఆ దిశగా వడివడిగా చర్యలు చేపడుతున్నారు. కాగా, హెచ్‌ఎండీఏకు వచ్చిన 1.70 లక్షల దరఖాస్తుల్లో లక్ష క్లియర్‌ అవగా, 62 వేల దరఖాస్తులను తిరస్కరించారు. వివిధ కారణాలతో 8 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.  
 
మళ్లీ దరఖాస్తుల వెల్లువ 
ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువును ఈ నెలాఖరు వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో చిన్నచిన్న కారణాలతో తిరస్కరణకు గురైన దరఖాస్తులను మళ్లీ రీ అప్పీల్‌కు పెట్టుకుంటున్నారు. వీటి సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. మళ్లీ ఈ దరఖాస్తులను టైటిల్‌ స్రూ్కటినీ, టెక్నికల్‌ స్రూ్కటినీ చేసి సక్రమంగా ఉంటే ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు కట్టాలంటూ దరఖాస్తుదారుడి సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం పంపుతారు. ఫీజు చెల్లించిన వెంటనే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. అయితే, ఊహించిన దానికన్నా దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఉన్న ప్లానింగ్‌ సిబ్బందిపై మోయలేని భారం పడుతుండడంతో పనులు వేగంగా ముందుకు సాగడం లేదు. ఇప్పటికే ఆ సిబ్బందికి తమ రోజువారీ పనులకు ఇవి అదనం కావడంతో ఆఫీసు సమయాన్ని మించి పనిచేస్తున్నారు. ఒక్కోసారి ఆన్‌లైన్‌ వ్యవస్థ మొరాయించడం కూడా వీరికి కష్టాలు తెచి్చపెడుతోంది. ప్రభుత్వం విధించిన తుది గడువుకు మరో 21 రోజులు మాత్రమే ఉండటంతో పూర్తిస్థాయిలో ఎల్‌ఆర్‌ఎస్‌పై దృష్టి సారించినట్టు హెచ్‌ఎండీ ప్లానింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు రూపంలో హెచ్‌ఎండీఏకు రూ.1000 కోట్ల ఆదాయం వచి్చన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌తో మరో రూ.100 కోట్లకు పైనే ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

మరిన్ని వార్తలు