ఇదేమి శిక్షణ?

17 Jun, 2014 03:45 IST|Sakshi

మంచిర్యాల సిటీ : జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్‌లతోపాటు పీజీ హెచ్‌ఎంల కొరత అధికంగా ఉంది. దీనికి తోడు ఉన్న పీజీ హెచ్‌ఎంలకు ఇన్‌చార్జి మండల విద్యాధికారులుగా అదనపు బాధ్యతలు ఉన్నాయి. విద్యావారోత్సవాలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ఏకరూప దుస్తుల అందజేత, పదో తరగతి ఇన్‌స్టంట్ పరీక్షలు, తరగతుల నిర్వహణ, అడ్మిషన్ల సమయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బిజీబిజీగా ఉంటారు.
 
ఇంతటి విలువైన సమయంలో రాష్ట్ర విద్యాశాఖ మారిన 9,10 తరగతుల కొత్త పాఠ్యపుస్తకాలపై పీజీ హెచ్‌ఎంలకు, స్కూల్ అసిస్టెంట్‌లకు ఈ నెల 16 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు మండలాల వారిగా టెలికాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సమయంలో శిక్షణ సరికాదని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. పదో తరగతి పరీక్షల అనంతరం సంబంధిత ఉపాధ్యాయులు మూల్యాంకనంకు వెళ్తారు. ఈ సమయంలోనే విద్యావారోత్సవాలు నిర్వహించాలి.
 
 15 రోజుల్లో..
 ఉన్నత పాఠశాలల్లో ఈనెల 16 తేదీ నుంచి 27 తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు ఇన్‌స్టంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 16 తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు విద్యావారోత్సవాలు నిర్వహించాలి. మారిన 9,10 తరగతుల పాఠ్యపుస్తకాలపై ఈనెల 16 తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, సబ్జెక్టు ఉపాధ్యాయులకు టెలికాన్ఫరెన్సు ద్వారా శిక్షణ ఇవ్వడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. పదో తరగతి పరీక్షలకు, శిక్షణకు ఇక్కడ హాజరయ్యే వారంతా కూడా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులే. దీంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా పోతారు. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు మూడు రకాల విధుల్లో పాల్గొంటే పాఠశాల పరిస్థితి, విద్యార్థుల చదువు ఏమవుతుందో ఫలితాల కోసం ఆరాటపడే అధికారులకే తెలియాలి.
 
ఖాళీలు..
జిల్లాలో పదోన్నతుల ప్రక్రియ 2012 జనవరిలో నిలిచిం ది. 90 శాతం ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది లేరు. పాఠశాల కార్యాలయం పనులు ఏవరో ఒక ఉపాధ్యాయుడు చేయాల్సిందే. 468 ఉన్నత పాఠశాలల్లో 356 స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికితోడుగా 38 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు. మిగిలిన 430 పాఠశాలల్లో పనిచేస్తు న్న ప్రధానోపాధ్యాయుల్లో 49 మంది ఇన్‌చార్జి మండల విద్యాధికారులుగా పనిచేస్తున్నారు. కాగా, శిక్షణ అనేది సెలవుల సమయంలో ఉంటేనే సమంజసంగా ఉంటుం దని ఉపాధ్యాయువర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
 
నష్టం
పదిహేను రోజులపాటు వివిధ కార్యక్రమాల పేరుతో ఉ పాధ్యాయుల, ప్రధానోపాధ్యాయులు బడికి దూరంగా ఉంటే పాఠశాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. పాఠశాల అరంభంలోనే అడ్మిషన్లు రావడం సహజం. ఈ కీలక సమయంలో అరకొర ఉపాధ్యాయులచే నడు స్తున్న పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు కనబడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో విద్యాశాఖకే  తెలియాలి. ఈ ప రిస్థితి ప్రవేటు పాఠశాలలకు పరోక్షంగా అవకాశం ఇచ్చి నట్లవుతుందని ఉపాధ్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పీఆర్‌వోలను ని యమించి, వీధివీధికి బస్సులను తిప్పుతూ అడ్మిషన్లను తీసుకుంటుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు శిక్షణ పేరిట వెళ్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అడ్మిషన్లు రావాలంటే ఎలా పస్తాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు