వేర్వేరు చోట్ల రూ. 6.45 లక్షలు పట్టివేత

13 Mar, 2014 23:18 IST|Sakshi

పరిగి/చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్:  జిల్లాలో గురువారం వేర్వేరు రెండు ఘటనల్లో రూ. 6.45 లక్షలు పట్టుబడ్డాయి. పరిగి మండలం రాఘవాపూర్ చెక్‌పోస్టు వద్ద బస్సులోంచి రూ. 4 లక్షలు, చేవెళ్ల మండలం ముడిమ్యాల చెక్‌పోస్టు దగ్గర కారులో తరలిస్తున్న రూ. 2.45 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరిగి పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాఘవాపూర్ చెక్ పోస్టు వద్ద గురువారం మధ్యాహ్నం సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐలు షేక్‌శంషొద్దీన్, జానకిరాంరెడ్డిలు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో షాద్‌నగర్ నుంచి పరిగి వస్తున్న ఆర్టీసీ బస్సు(ఏపీ 28 వై 3190)లో సూర్య(21), అర్జున్‌రావు(21) అనే ఇద్దరు యువకులు వస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో వారి వద్ద ఉన్న బ్యాగులో రూ. 4 లక్షలు పట్టుబడ్డాయి.

 ఈమేరకు వారిని అదుపులోకి తీసుకుని పరిగి ఠాణాకు తరలించారు. యువకులు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నివాసులుగా గుర్తించారు. వికారాబాద్‌లోని ఇండియా ఇన్ఫ్‌లెన్స్ లిమిటెడ్ సంస్థలో తాము కాల్ కస్టమర్ ఎగ్జిక్యూటీవ్‌లుగా పని చేస్తున్నట్లు తెలిపారు. వారు డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో సదరు నగదును ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

 మరో ఘటనలో రూ. 2.45 లక్షలు..
 చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల చెక్‌పోస్టు వద్ద గురువారం మారుతీ జెన్ కారు(ఏపీ 28 ఏడీ 9451)లో తరలిస్తున్న రూ. 2. 45 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 శంషాబాద్ మండలం కవ్వగూడెంవాసి మెరుగు సిద్దేశ్వర్ వికారాబాద్‌కు వెళ్తున్నాడు. ఆయన కారులో ఉన్న రూ.2.45 లక్షలకు సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని, సదరు నగదును ఆదాయ శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీరెడ్డి చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు రూ. 50 వేలకు మించి తీసుకెళ్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు