ఆహ్లాదకరంగా ఎట్‌ హోం..

16 Aug, 2018 05:47 IST|Sakshi
బుధవారం రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌ హోం కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, సీఎం కేసీఆర్, సీజే రాధాకృష్ణన్, ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఎంపీలు దత్తాత్రేయ, కే కేశవరావు

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ నేతలు, న్యాయాధిపతులు, అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఇచ్చిన ఈ తేనీటి విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎన్‌. చినరాజప్ప, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ టి.బి.రాధాకృష్ణన్, రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్, స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారి పాల్గొన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కె.కేశవరావు, డి.శ్రీనివాస్, సుజనా చౌదరి, బి.వినోద్‌కుమార్, మల్లారెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌ హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు