రీజినల్‌ పార్టీలో నేషనల్‌ పార్టీ విలీనమా? 

22 Dec, 2018 15:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికార బలంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిపక్షాలపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఫహీం మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్‌ సభ్యులుగా గుర్తిస్తూ మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ బులిటెన్‌ విడుదల చేయడం దారుణమన్నారు. శనివారం ఫహీం మీడియాతో మాట్లాడుతూ.. మండలి ఛైర్మన్‌కు అసలు రాజ్యాంగం గురించి తెలుసా అని ప్రశ్నించారు. స్వామిగౌడ్‌ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నేషనల్‌ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం చేస్తూ ఆయన జారీచేసిన బులిటెన్‌ సరికాదన్నారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో అవాంతరాలను ఎదుర్కొందని, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందన్నారు. 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తమకు అనుమానులున్నాయని కాంగ్రెస్‌ నేత మానవతారాయ్‌ ఆరోపించారు. ఎన్నికల అధికారిని రీకాల్‌ చేసే అవకాశం ఉన్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృత్తం అవుతాయనే భయంతో కేంద్రం టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తోందన్నారు. 

మరిన్ని వార్తలు