వందల క్వింటాళ్లు వర్షార్పణం

25 Apr, 2018 03:19 IST|Sakshi
మంగళవారం బూర్గంపాడు మార్కెట్‌లో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న రైతు

ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో అకాల వర్షం

బూర్గంపాడు/ఖమ్మం వ్యవసాయం/ కొత్తగూడ/సంగెం: ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది.  భారీ వర్షానికి వందల క్వింటాళ్ల ధాన్యం వర్షార్పణమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం రాశులు అకాల వర్షానికి తడిశాయి. 100 లారీ ల ధాన్యాన్ని రైతులు విక్రయించేందుకు తేగా.. వర్షం కురిసే సమయంలో రైతులు కొంతమేర పట్టాలు కప్పి కాపాడుకున్నారు.

మిగతా 60 లారీల లోడ్లకు సరిపోయే ఆరబోసిన ధాన్యం నీటి పాలైంది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడిన కష్టం ఫలితాన్ని ఇవ్వలేదు. నిమిషాల వ్యవధిలో వాన నీటిలో ధాన్యం కొట్టుకుపోతుంటే.. రైతులు కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు 20 బస్తాల ధాన్యం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిందని, వందల క్వింటాళ్ల ధాన్యం పనికిరాకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్, కొత్తగూడ, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, సంగెం మండలాల్లో వర్షం కురిసింది. రైతులు అమ్మడానికి తీసుకొచ్చిన మక్కలు, పసుపు మార్కెట్లలో తడిసిపోయాయి. 

మరిన్ని వార్తలు