మోమిన్పేట (వికారాబాద్): ఆస్తి కోసం కట్టుకున్న ఇల్లాలినే అంతం చేశాడు. పొలంలో పనిచేస్తుండగా గొడ్డలితో మెడపై నరికి దారుణంగా హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బేగరి అనంతయ్య కొన్నేళ్ల క్రితం మర్పల్లి మండలం సిరిపురానికి చెందిన పద్మమ్మ (35)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తొమ్మిదేళ్ల క్రితం దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు జరిగి విడిగా ఉంటున్నారు. అయితే ఆస్తి కావాలని పద్మమ్మ కొంత కాలం క్రితం కోర్టును ఆశ్రయించింది.
అనంతయ్య ఎనిమిదేళ్ల క్రితం నవనీతను రెండో వివాహం చేసుకున్నాడు. అనంతయ్య తనకున్న ఎనిమిది ఎకరాల్లోంచి కొంత భూమిని విక్రయించాడు. ఈ నేపథ్యంలో కూతుళ్ల పోషణ భారం కావడంతో పద్మమ్మ మూడు నెలల క్రితం గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. దీంతో అనంతయ్య అయిష్టంగానే రెండెకరాల పొలాన్ని ఆమెకు ఇచ్చాడు. అయితే పొలం తన వశం కావాలంటే.. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం స్వగ్రామానికి వచ్చి పద్మమ్మ పొలంలో పనిచేస్తుండగా.. గొడ్డలితో ఆమె మెడపై నరికేసి పారిపోయాడు.