భర్త ఇంటి ఎదుటే ఊర్మిళ దీక్ష

29 Oct, 2014 04:56 IST|Sakshi
భర్త ఇంటి ఎదుటే ఊర్మిళ దీక్ష

తుంగతుర్తి : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. తల్లిదండ్రులు నిరాకరించారని కాదు పొమ్మన్నాడు.. దీంతో తనకు న్యాయం చేయాలని భార్య ఆ భర్త ఇంటి ఎదుటే మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన తుంగతుర్తి మండలం పసునూర్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన  మల్లేపాక శ్రీరాములు రెండో కుమారుడు సందీప్ కుమార్ మూడేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది క్రితం హైదరాబాద్‌కు చెందిన ఊర్మిళతో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి ఈ ఏడాది జనవరి 22న అక్కడే ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. కొంత కాలం వరకు అక్కడే కాపురం కూడా చేశారు.

 ఇటీవల సందీప్ తన భార్యతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. అయితే అతడి తల్లిదండ్రులు పెళ్లిని ఒప్పుకోలేదు. దీంతో ఊర్మిళను అప్పటి నుంచి సందీప్ అతడి కుటుంబ సభ్యులు వేధించసాగారు. సందీప్ తన నుంచి విడిపోవాలని ఊర్మిళను ఒత్తిడి చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో మూడు రోజుల క్రితం ఊర్మిళను పసునూరులోనే వదిలి సందీప్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. అయితే అప్పటి నుంచి భర్త ఇంటి ఎదుటే ఊర్మిళ దీక్ష చేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అటు తల్లిదండ్రులు రానివ్వడం లేదని.. ఇటు చూస్తే తనకు వద్దంటూ భర్త ఎక్కడికో వెళ్లిపోయాడని.. న్యాయం జరగకుంటే చావు తప్ప వేరే మార్గం లేదని ఊర్మిళ విలపిస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటోంది.  
 

మరిన్ని వార్తలు