వైరల్‌: ఆపరేషన్‌ చేస్తుండగా టిక్‌టాక్‌!

23 Feb, 2020 17:56 IST|Sakshi

సాక్షి, హుజురాబాద్‌: వైద్యులు ఆపరేషన్‌ చేస్తుండగా తీసిన టిక్‌టాక్‌ వీడియో ఒకటి కలకలం రేపింది. ఈ ఘటన తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నియోజకవర్గం హుజురాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది. డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, మరికొందరు సిబ్బంది ఓ పేషంట్‌కు ఆపరేషన్‌ చేస్తుండగా టిక్‌టాక్‌ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. బిగిల్‌ చిత్రంలోని ఓ డైలాగ్‌తో నడిచే ఈ టిక్‌టాక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. విధుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో స్థానికులు, పేషంట్ల ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే ఆస్పత్రిలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ డాక్టర్‌ను గతంలో సస్పెండ్‌ చేయడం గమనార్హం.

ఆ టిక్‌టాక్‌తో సంబంధం లేదు..
కాగా, టిక్‌టాక్‌ వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ‘ఆపరేషన్‌ చేస్తుండగా సాధారణంగా వీడియో తీసి పేషంట్‌ తరపు వారికి ఇస్తాం. అరుదైన శస్త్ర చికిత్సల సమయంలో వీడియో తీసి మీడియాకు అందచేస్తాం. ఎవరో కావాలనే ఆపరేషన్‌ థియేటర్‌లో మామూలుగా తీసిన వీడియోను ఎడిట్‌ చేసి టిక్‌టాక్‌లో పెట్టారు. నేను టిక్‌ చేసినట్టు రుజువైతే దేనికైనా సిద్ధం. అది నా ఐడీ కూడా కాదు’అని శ్రీకాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు