సాక్షి, హైదరాబాద్ : జమ్మూకశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నగరంలో రేపటి వరకు హై అలర్ట్ కొనసాగుతుందని సిటీ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేయడం లేదని వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి సీపీ వరకు అందరూ అధికారులు అందుబాటులో ఉన్నారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను రంగంలో దింపామని చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్, పికెట్తో పాటు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఏదైనా సంఘనలు జరిగితే 100కు డయల్ చేయాలని, లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నగరంలో సభలు, నిరసనలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న ఐదు జోన్ల పరిధిలోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు.