‘ఆపరేషన్‌ స్మైల్‌’ మంచి ఫలితాలు ఇస్తోంది

28 Jan, 2019 14:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఆపరేషన్‌ స్మైల్‌’ కార్యక్రమం చాలా మంచి ఫలితాలిస్తుందంటున్నారు సీపీ అంజనీ కుమార్‌. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘జనవరి1, 2019 నుంచి ‘ఆపరేష్‌ స్మైల్‌’ నిర్వహిస్తున్నాం. తప్పిపోయిన పిల్లల్ని ట్రేస్‌ చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. దీని కోసం అడిషనల్‌ సీపీ క్రైం నేతృత్వంలోని 17 బృందాలు పాల్గొన్నాయి’ అని తెలిపారు.

అంతేకాక ‘‘ఆపరేషన్‌ స్మైల్‌’లో భాగంగా ఇప్పటివరకూ 325 మంది చిన్నారులను కాపాడాం. వీరిలో 11 మంది బాలికలు ఉన్నారు. ఇలా కాపాడిన పిల్లల్లో 272 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించాము. 53 మందిని రెస్క్యూ హోమ్‌లో చేర్పించామ’ని తెలిపారు. ‘దర్పణ్‌’ అనే ఫేస్‌ రికగ్నేషన్‌ యాప్‌ ద్వారా ఈ పిల్లలను కనిపెట్టగలిగినట్లుగా సీపీ చెప్పారు. అంతేకాక చిన్నారుల చేత పనులు చేయిస్తున్న 14 మంది మీద కేసులు నమోదు చేశామని తెలిపారు.

‘మా పిల్లల్ని క్షేమంగా మా వద్దకు చేర్చిన హైదరాబాద్‌ పోలీసులకు రుణపడి ఉంటాం. మా పిల్లల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. మాయమాటలు చెప్పి పిల్లల్ని తీసుకెళ్లి వారిని బాలకార్మికులుగా మారుస్తున్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని బాధిత పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు