పాక్‌ పంజరంలో ప్రేమ పావురం

19 Nov, 2019 11:14 IST|Sakshi

పాక్‌లో పట్టుబడ్డ హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌

ప్రియురాలి కోసమే వెళ్లినట్టు ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఉన్న బహవాల్‌పూర్‌లో ఇద్దరు భారత యువకుల్ని చోలిస్తాన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈనెల 14న పాక్‌ పోలీసులు అదుపులోకి తీసుక్ను ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి విశాఖపట్నంకు చెందిన ప్రశాంత్‌గా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌ ప్రేమించిన అమ్మాయి కోసం పాక్‌ సరిహద్దును దాటినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ప్రశాంత్‌ తండ్రి బాబురావు పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రశాంత్‌ తన ప్రియురాలు (స్వప్నిక) కోసం తమతో విభేదించాడని, ఈ నేపథ్యంలోనే రెండేళ్ల నుంచి కనిపించడంలేదని ఆయన తెలిపారు.

గతంలో ప్రశాంత్‌ బెంగళూర్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో స్వప్నిక పరిచయం అయిందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రశాంత్‌ పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్లాడో మాత్రం తమకు తెలీదని అంటున్నారు. గత రెండేళ్లుగా పూర్తి డిప్రెషన్‌లో ఉన్నాడని, మతిస్థిమితం కోల్పోయాడని కూడా అతని తండ్రి వాపోయారు. ఈ మేరకు మంగళవారం మదాపూర్‌ పోలీసులకు బాబురావు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా తన కుమారుడిని క్షేమంగా తీసుకురావాలని వేడుకున్నారు. ఇదిలావుండగా అతని ప్రియురాలి కోసం గూగుల్‌ మ్యాప్‌లో దోలాడుతూ పాక్‌లోకి ప్రవేశించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియురాలి కోసం హైదరాబాద్‌ నుంచి పాక్‌ను వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. కాగా ప్రశాంత్‌ తెలుగులో మాట్లాడిన 1.03 నిమిషాల నిడివి గల వీడియో సైతం హల్‌చల్‌ చేస్తోంది. అందులో అతడి వెనుక ముస్తాఫా అనే పేరు గల నేమ్‌ప్లేట్‌తో ఆకుపచ్చ రంగు యూనిఫాంలో ఒకరు నిల్చుని ఉన్నారు. (పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హైదరాబాదీ)

అయితే పాక్‌ మీడియా మాత్రం అతను అక్రమంగా ప్రవేశించాడని, పాక్‌ నుంచి యూరప్‌ వెళ్లే ప్రయత్నంలో పట్టుబడినట్టు పలు కథనాలను ప్రచురించింది. వీరు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించినట్లు ఆరోపిస్తూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. వీరిలో ఒకరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో పాకిస్తాన్‌లో ప్రత్యేక ఆపరేషన్‌కు భారత్‌ కుట్ర పన్నిందని పాక్‌ మీడియా ఆరోపించింది. అయితే ఇద్దరు భారతీయ యువకులు పాక్‌లో బందించడంపై నేడు భారత రక్షణ శాఖ సమావేశం కానుంది. అక్కడి అధికారులతో మాట్లాడి పరిస్థితిపై సమీక్షించనుంది.

పాక్‌లో పట్టబడ్డ ప్రశాంత్‌ను విడిపించేందు​కు ‍ప్రయత్నిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ రాంమాధవ్‌ తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌లతో చర్చించామని అన్నారు.

మరిన్ని వార్తలు