సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం కీర్తి ప్రతిష్టలను మరోసారి దేశవ్యాప్తంగా తెలియచేసిన ఘనత హైదరాబాద్ మెట్రో రైలుది. అలాంటి మెట్రో స్టేషన్లు పలు అసాంఘీక కార్యక్రమాలకు నెలవులుగా మారుతున్నాయి. మెట్రో ప్రారంభమైన నెల రోజులు కాకముందే ఓ ప్రబుద్దుడు యువతుల ఫోటోలు అసభ్యకరంగా తీస్తూ దొరికిన సంగతి మర్చిపోకముందే మరో సంఘటన చోటు చేసుకుంది.
సికింద్రాబాద్కు చెందిన యువతి గురువారం పనినిమిత్తం జేఎన్టీయూ వెళ్లడానికి మెట్రోరైలు ఎక్కింది. అమీర్పేట స్టేషన్ వద్ద ఇంటర్చేంజ్ సమయంలో ఎలా వెళ్లాలంటూ అక్కడ విధులు నిర్వహిస్తున్న నితిన్ రెడ్డిని అడిగింది. మూడో అంతస్తుకు వెళ్లాలని చెప్పిన నితిన్రెడ్డి.. ఆమెతోపాటు లిప్ట్లో ఎక్కి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేశాడు. ఈ సంఘటతో షాక్ తిన్న యువతి, ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నితిన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.