సాక్షి, సిటీబ్యూరో: నైపుణ్య ఉద్యోగాల సాధనలో గ్రేటర్ హైదరాబాద్ నగరం నంబర్ వన్గా నిలిచింది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో దూసుకెళ్తున్న సిటీ..నైపుణ్య ఉద్యోగాల కల్పన విషయంలోనూ అగ్రభాగాన నిలవడం విశేషం. గతేడాది మన రాష్ట్రంలోని 12 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొంది..అత్యున్నత సాంకేతిక ఉద్యోగాలు సాధించిన వారిలో 3374 మంది కేవలం హైదరాబాద్ జిల్లా వాసులే ఉన్నారు. వీరిలో చాలా మంది పలు దేశ విదేశీ కంపెనీల్లో వృత్యంతర శిక్షణ పొంది..అనంతరం ఉద్యోగాలు సాధించారు. ఇక మన పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 893 మంది, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 856 మంది, మెదక్లో 806 మంది, ఖమ్మంలో 390 మంది పలు కంపెనీల్లో అప్రెంటిషిప్ శిక్షణ పొంది అనంతరం ఉద్యోగాలు సాధించారు. మెత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 7785 మంది ఉద్యోగార్థులు పలుకంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. 2018లో వీరిసంఖ్య 3852 మాత్రమే కావడం గమనార్హం.
శిక్షణ పొందిన వారిలో అత్యధికంగా అత్యంత నైపుణ్యం, పుష్కలంగా ఉద్యోగావకాశాలు గల న్యూ ఏజ్ సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందడం విశేషం. ప్రధానంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు..స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో శిక్షణ పొందుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్, స్మార్ట్ హెల్త్ కేర్, సోలార్ ఎనర్జీ, జియో ఇన్ఫర్మేటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర కోర్సుల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సుల్లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధిస్తున్నట్లు సిల్క్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాల్లో శిక్షణ ఏర్పాట్లు ఏర్పాటు చేశామన్నా. ఇటీవల స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నూతనంగా రెండేళ్ల కాలవ్యవధిగల డిప్లొమా కోర్సులు ప్రవేశ పెట్టారు. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సాంకేతిక అంశాలు ఈ కోర్సులో అంతర్భాగంగా ఉన్నాయన్నారు. స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు సాధించడంతోపాటు వారి వారి రంగాల్లో ఉన్నతంగా రాణిస్తున్నారన్నారు.