కరోనా తెచ్చిన ‘గ్రేటర్‌’ మార్పు

28 May, 2020 09:18 IST|Sakshi

ప్లాస్టిక్‌ను వదిలేస్తున్న నగర ప్రజలు

దాంతోపాటే అనవసర చెత్తాచెదారాలు కూడా..

తోటపనులపై శ్రద్ధ, అవసరం మేరకే వంటలు

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌–19 నగర ప్రజల్లో ఎంతోమార్పు తెచ్చింది. కరోనా వైరస్‌ ప్రభావం బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన పలు జాగ్రత్తలు తీసుకుంటుండటంతో పాటు అనవసర వ్యర్థాలు, ఇంట్లోని చెత్తాచెదారాల్ని వదిలించుకుంటున్నారు. అంతే కాదు..అనవసరంగా దుబారా చేయకుండా అవసరమైన మేరకే వంట చేసుకుంటున్నారు. ఇంటి పని, వంట పనితో పాటు మొక్కల సంరక్షణపై తగు చర్యలు తీసుకుంటూ అనవసరమైన  పనికిరాని, ఎండిపోయిన మొక్కల్ని ఏరిపారేస్తున్నారు. అంతేకాదు.. ఇంట్లో ఎంతోకాలంగా ఉన్నపాత, పనికిరాని చెక్కవస్తువులు, సామాగ్రి తదితరమైన వాటిని సైతం పారేస్తున్నారు. ఇంట్లో కుప్పలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల్ని, వాడి పారేసిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను, సాచెట్లు తదిరతమైనవాటిని వదిలించుకుంటున్నారు. (మల్లన్నా.. గిదేందన్నా!)

కోవిడ్‌–19 నేపథ్యంలో లాక్‌డౌన్‌కు ముందు..లాక్‌డౌన్‌ తరుణంలో రెండు నెలల్లో  ఇళ్ల నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు చేరిన చెత్తను, వాటిలోని వ్యర్థాలను అంశాల వారీగా పరిశీలిస్తే ఈ విషయాలు వెల్లడయ్యాయి. హోటళ్లు వంటివి లేకపోవడంతో ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగం తగ్గినప్పటికీ, వాటి వ్యర్థాలు వాటితోపాటు ప్లాస్టిక్‌ బాటిల్స్‌ సాచెట్స్‌ ఎక్కువ శాతం డంపింగ్‌యార్డుకు చేరడం, తోటపనులు చేస్తుండటం వల్ల వాటికి సంబంధించిన వ్యర్థాల శాతం పెరగడం కూడా ఇందుకు నిదర్శనం. చెక్క, పేపర్‌ వ్యర్థాలు సైతం ఇదే కోవలో ఉన్నాయి. వంటింట్లో అవసరానికి మించి వంటలు చేయకపోవడం వంటివాటితో భూమిలో కలిసే ఆకు, కాయగూరల వ్యర్థాల శాతం తగ్గింది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం, నీరసించి పోకుండా ఉండేందుకు వేసవి కారణంగానూ  కొబ్బరి బొండాలను ఎక్కువగా తాగడంతో వాటి వ్యర్థాల శాతం యాభై శాతం కంటే పెరిగింది. ప్రైవేట్‌ ఆస్పత్రులో ఆపరేషన్లు బాగా తగ్గించడం తదితర కారణాలతో బయోమెడికల్‌ వ్యర్థాల శాతం బాగా తగ్గింది. (ప్లాస్టిక్ను ఇలా కూడా వాడొచ్చు..)

లాక్‌డౌన్‌కు ముందు రెండు నెలల్లో రోజుకు సగటున డంపింగ్‌యార్డుకు చేరిన వ్యర్థాలు: 6200 మెట్రిక్‌ టన్నులు  
లాక్‌డౌన్‌లో రెండునెలల్లో రోజుకు సగటున డంపింగ్‌యార్డుకు చేరిన వ్యర్థాలు: 4800 మెట్రిక్‌ టన్నులు
సగటున తగ్గిన వ్యర్థాలు రోజుకు : 1400 మెట్రిక్‌ టన్నులు

మరిన్ని వార్తలు